రిజిస్ట్రేషన్‌శాఖలో పదోన్నతులకు బ్రేక్‌

12 Dec, 2016 14:41 IST|Sakshi
రిజిస్ట్రేషన్‌శాఖలో పదోన్నతులకు బ్రేక్‌
జీవో నంబర్‌ 224 జారీ
ఉద్యోగులకు నిరాశే
కాకినాడ లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖలో జరగాల్సిన పదోన్నతులకు బ్రేక్‌ పడింది. జిల్లాస్థాయిలో కాకుండా జోన్లస్థాయిలో పదోన్నతుల జాబితాను తయారు చేయాలని కొంతమంది ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆదేశానుసారం ప్రభుత్వ కార్యదర్శి అజయ్‌కలాం పదోన్నతులకు బ్రేక్‌ వేస్తూ 224 జీవోను జారీచేశారు. గతంలో జిల్లాస్థాయిలో పదోన్నతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కొందరు ఉద్యోగులు జోనల్‌స్థాయిలో అయితే సీనియార్టీ ప్రకారం పదోన్నతులు వస్తాయని హైకోర్టుకు నివేదించారు. వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పదోన్నతులను నిలిపివేయాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభ్వుతం న్యాయస్థానం ఆదేశాన్ని అమలు చేసేందుకు జీవో నంబర్‌ 224 జారీచేసింది. 
జిల్లాలో 21 మందికి పదోన్నతులకు బ్రేక్‌
ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం పదోన్నతులొస్తే జిల్లాలో 21 మంది జూనియర్‌ అసిస్టెంట్లు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. కాకినాడ  రిజిస్ట్రేషన్‌ పరిధిలో 11 మంది, రాజమహేంద్రవరం పరిధిలో 10 మందికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. పదోన్నతులు నిలిపివేయడంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. మళ్లీ జీవో వచ్చే వరకు వేచి ఉండక తప్పదని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. 
మరిన్ని వార్తలు