గురివింద సామెతలు చెప్పకండి

17 Jun, 2016 03:23 IST|Sakshi
గురివింద సామెతలు చెప్పకండి

 దిగ్విజయ్‌పై గుత్తా మండిపాటు
 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ:
‘నా జీవితంలో ఎప్పుడూ కాంట్రాక్టులు చేయలేదు. కాంట్రాక్టులు చేసే వారితో నాకు సంబంధాలు కూడా లేవు’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కాంట్రాక్టులు, డబ్బుల కోసమే పార్టీని వీడుతున్నాననడం కాంగ్రెస్ నేతలకు సంస్కారం కాదన్నారు. నల్లగొండలో గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గురివింద సామెతలు చెబుతున్నారన్నారు. ఇప్పుడు కాం గ్రెస్‌లో ఉన్న నేతలు ఎందుకు కాంట్రాక్టులు తీసుకుంటున్నారని గుత్తా ప్రశ్నించారు.

కాం గ్రెస్‌లో అంతర్గత రాజకీయాలకు విసిగిపో యే తాను టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటానని ప్రకటించానన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని, నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నికలు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. తన వియ్యంకుడు కాంట్రాక్టరే. ఆ కుటుంబంతో బంధుత్వం ఏర్పడి కొన్ని ఏళ్లే అయిందని గుత్తా తెలిపారు. కానీ వారి కంపెనీ కింద 60-70 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులు చేస్తున్నారని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. తన నిజాయితీ నిరూపించుకు నేందుకు అవసరమైతే వెంకటేశ్వరస్వామి గర్భగుడిలో ప్రమాణం చేస్తానన్నారు.
 

మరిన్ని వార్తలు