సైకాలజిస్టుల కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి

29 Jan, 2017 23:29 IST|Sakshi
సైకాలజిస్టుల కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి
కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రంలో సైకాలజిస్టుల కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేసన్‌–ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ హిప్నో కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక రాజవిహార్‌ సమీపంలోని అమృత సైకాలజీ కౌన్సిలింగ్‌ అండ్‌ హెచ్‌ఆర్‌డీ సెంటర్‌లో జరిగిన సైకాలజిస్ట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సైకాలజిస్టులు వేల సంఖ్యలో ఉన్నప్పటికీ కౌన్సిలింగ్‌ సైకాలజీకి వృత్తిపరంగా స్పష్టత, భద్రత లేకపోవడంతో ఆ కోర్సులు చదివిన వారు వేరే ఉద్యోగాలు, వృత్తులవైపు మళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
2009లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.19,2010 ప్రకారం ప్రతి విద్యాలయం సైకాలజిస్టుల సేవలను వినియోగించుకోవాలని కోరారు.  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ  సైకాలజిస్టులను వైద్యులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎస్‌. బాలాజీరావు, ఎ. వెంకటసుబ్బయ్య, ఎస్‌. సురేంద్రబాపూజి, ప్రధాన కార్యదర్శిగా టి. పుల్లయ్య, సహాయ కార్యదర్శులుగా  బి. సంధ్యాజ్యోతి, కె. విజయకుమార్, కోశాధికారిగా ఎన్‌సీ మహాదేవి ఎన్నికయ్యారు. 
 
మరిన్ని వార్తలు