ఎద ఎదలో ఉప్పొంగిన అభిమానఝురి

2 Sep, 2016 23:12 IST|Sakshi
ఎద ఎదలో ఉప్పొంగిన అభిమానఝురి
 
ఆ చిరునవ్వు దూరమై అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. గుండె లోతుల్లో కొలువైన మహనీయుడ్ని తలుచుకోని వారు లేరు.. చమర్చిన కళ్లతో ప్రతి హృదయం పేదల దైవం కోసం పరితరించింది. సృష్టి ఉన్నంత కాలం ఆయన సేవలు అజరామంఅంటూ వేనోళ్ల కీర్తించింది. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలే కాదు.. పార్టీలకతీతంగా కూడా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సైతం మహానేతను స్మరించుకుని నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్, సామాజిక పింఛన్లు ఇలా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ మహానేతను స్మరించుకున్నారు. మహానేత విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులైతే ఊరూ వాడా సేవా కార్యక్రమాలతో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆస్పత్రులు, విద్యాలయాలు, అనాథాశ్రమాల్లో అన్నదానాలు, నిరుపేదలకు వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, ఆర్థిక సహాయం చేయగా, ఆస్పత్రుల్లో రోగులకు పాలు,పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
–సాక్షి, విశాఖపట్నం
 
మరిన్ని వార్తలు