ఉద్యోగ భర్తీ నిబంధనల సవరణపై పిటిషన్లు

29 Oct, 2015 04:02 IST|Sakshi
ఉద్యోగ భర్తీ నిబంధనల సవరణపై పిటిషన్లు

♦ పోస్టులన్నీ తెలంగాణ వారితోనే భర్తీ చేసే యత్నం
♦ ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
♦ హైకోర్టుకు నివేదించిన పిటిషనర్లు
 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ నిబంధనలకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలు సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు విద్యుత్ సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం చేపడతామంది. చల్లా నర్సింహారెడ్డి, మరికొందరు దాఖలుచేసిన ఈ వ్యాజ్యాలను తొలుత విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ రెడ్డి కాంతారావు.. ఇవి ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి వస్తాయి కాబట్టి, వీటిని ధర్మాసనం విచారించడమే సబబంటూ వాటిని ధర్మాసనానికి నివేదించారు.

ఈ నేపథ్యంలో వీటిని బుధవారం ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ, ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్‌లుగా విభజించాయని తెలిపారు. ఈ రెండు జోన్‌లలో ఏదో ఒక జోన్‌లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి విద్యాభ్యాసం చేసిన వారిని స్థానికులుగా పరిగణిస్తారన్నారు. 70 శాతం తెలంగాణలో రెండు జోన్లకని చెబుతూ, మిగిలిన 30 శాతం పోస్టులను స్థానికేతరులకు అంటున్నారని, ఆ 30 శాతం తెలంగాణలోని అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారని వివరించారు. ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఒకవేళ అటువంటి రిజర్వేషన్లు కల్పించాలంటే అది పార్లమెంట్ మాత్రమే చేయాలని, విద్యుత్ సంస్థలు కాదన్నారు. ప్రాథమికంగా ఈ వాదనల్లో కొంత బలముందని, కాబట్టి పూర్తి వివరాలను తమ ముందుంచాలని విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది.

మరిన్ని వార్తలు