ఆత్మహత్యల్లో రెండోస్థానం.. అవినీతిలో ఫస్ట్ ర్యాంక్!

22 Jun, 2016 23:21 IST|Sakshi
ఆత్మహత్యల్లో రెండోస్థానం.. అవినీతిలో ఫస్ట్ ర్యాంక్!

కమీషన్ కాకతీయగా మార్చారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి


పరకాల: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లోనే కొడుకు, కూతురు, అల్లుడుతో కలిసి అవినీతి పునాదులు వేస్తున్నారని, మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని దామెర చెరువు, ధర్మారంలోని మారేడు చెరువును బుధవారం ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుసరి అనసూయ(సీతక్క), వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ కాకతీయకు తాము వ్యతిరేకం కాదని, చెరువుల పూడికతీత పనులలో జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు.

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ టెండర్లలో జరిగిన అవినీతిని ప్రజల ముందు పెడితే నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉండగా, అవినీతిలో మాత్రం మొదటి స్థానాన్ని ఆక్రమించిందన్నారు. టీఆర్‌ఎస్ నాయకులకే కాంట్రాక్ట్‌లు ఇప్పించుకుని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించిన కోదండరాంను విషపునాగు అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

మరిన్ని వార్తలు