తాత అమ్మమ్మ మందలించారని..

19 Oct, 2016 21:05 IST|Sakshi
తాత అమ్మమ్మ మందలించారని..
యువకుడి ఆత్మహత్య
మద్యానికి బానిసయ్యాడని మందలింపు
 
పెదకూరపాడు: మద్యానికి బానిసైనందుకు తాత, అమ్మమ్మ మందలించారన్న కోపంతో వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెదకూరపాడు నుంచి లగడపాడులో చోటు చేసుకుంది. పెదకూరపాడు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి మండలం ఆత్తలూరు గ్రామానికి చెందిన బుల్లా రామస్వామి, మరియమ్మ పెద్ద కుమారుడు బుల్లా సాగర్‌బాబు(20) అమ్మమ్మ ఊరు అయిన పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనులు  చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండడంతో అమ్మమ్మ వేమవరపు మార్తమ్మ మందలించింది. దీంతో సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన సాగర్‌బాబు లగడపాడు నుంచి పెదకూరపాడు వెళ్లే మార్గమధ్యంలో పెదకూరపాడు చెందిన కర్ణం వీరయ్య పంట పొలంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనులు నిమిత్తం బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో వీరయ్య పొలంలోకి పనులకు వచ్చిన కూలీలు బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీఆర్వో నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అమరావతి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.
మరిన్ని వార్తలు