కళ్లెం ఎక్కడ?

23 Oct, 2016 17:30 IST|Sakshi
కళ్లెం ఎక్కడ?
* ఆగని ఇసుక అక్రమ రవాణా
సీఎం నివాసం సమీపంలోనే తవ్వకాలు
కూలీల స్థానంలో యంత్రాలతో తోడేస్తున్న వైనం 
అధికారుల దాడులను లెక్కచేయని ఇసుకాసురులు
చక్రం తిప్పుతున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు 
 
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని పరిధిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సీఎం నివాసం సమీపంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. కూలీలతో అయితే తవ్వకాలు ఆలస్యమవుతున్నాయని యంత్రాలను రంగంలోకి దించారు. తాత్కాలిక సచివాలయం పేరుతో రాత్రింబవళ్లూ ఇసుక తోడేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుని అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ఎప్పుడైనా వెళ్తే అధికారి పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
 
ఆ మూడు రీచ్‌లలో అంతులేని అక్రమాలు..
తుళ్లూరు మండలంలోని బోరుపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం రీచ్‌లలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇసుక అక్రమంగా తవ్వేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు తాత్కాలిక సచివాలయం పేరుతో భారీ స్కెచ్‌ వేశారు. ఈ మేరకు రోజు బోరుపాలెం రీచ్‌ నుంచి వెయ్యికి పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. లింగాయపాలెం, వెంకటాయపాలెం రీచ్‌ల నుంచి మరో వెయ్యికి పైగా లారీల ఇసుక తవ్వేస్తున్నారు. ఈ మూడు రీచ్‌లలో సగటున నెలకు 60వేల లారీల ఇసుక తోడేస్తున్నారు. లారీ సామర్థ్యాన్ని బట్టి మూడు యూనిట్ల నుంచి ఆరు యూనిట్ల వరకు ఇసుక లోడ్‌ చేస్తారు. రోజుకు రెండు వేల లారీలకు సగటున 9 వేల యూనిట్ల ఇసుక తవ్వేస్తున్నారు. నెలకు 2.70 లక్షల యూనిట్ల ఇసుకను కృష్ణమ్మ గర్భం నుంచి తోడేస్తున్నారు. స్థానిక అవసరాలకు ఇంత భారీగా వినియోగిస్తారా.. అంటే అధికారులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించే ఒక్కో లారీకి సామర్థ్యాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.75 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులకు నెలవారీ మాముళ్లు వెళ్తుండటంతో వారు అక్రమ రవాణాకు రెడ్‌ కార్పెట్‌ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై విమర్శలు వచ్చినప్పుడు, పత్రికల్లో వార్తలు ప్రచురించినప్పుడు మాత్రమే అధికారులు ఇసుక రీచ్‌లలో దాడులు చేసి 10 నుంచి 20 లారీలను పట్టుకున్నామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. దాడులు చేసిన సమయంలో రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు సాగించాలని అధికారులే సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.
 
ఒక్క రీచ్‌లో 400 లారీలు..
లింగాయపాలెం రీచ్‌కు శనివారం ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లగా.. అక్కడ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో వందలాది లారీలకు ఇసుక నింపుతున్నారు. సుమారు 400 లారీలకు యంత్రాలతో ఇసుక నింపటం కనిపించింది. ఇవన్నీ రాజధాని ప్రాంత అవసరాల కోసం తరలిస్తున్నాయా.. అని ఆరా తీస్తే.. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఈ రీచ్‌ నుంచి నిత్యం 500కు పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 
 
లింగాయపాలెం రీచ్‌ వద్ద ఆందోళన..
లింగాయపాలేనికి చెందిన 150 మంది దళితులు క్వారీ అసోసియేషన్‌ పేరుతో రిజిష్టర్‌ చేయించుకుని రీచ్‌ వద్ద లోడింగ్‌ పనులు చేసుకుంటున్నారు. తాజాగా ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించడతోపై రీచ్‌ వద్ద స్థానిక దళితులు శనివారం ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణమ్మను నమ్ముకోని జీవనం సాగిస్తున్న తమను పచ్చ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కూలీలను కాదని భారీ యంత్రాలతో ఇసుకు తొడేస్తూ ఆ రీచ్‌ వైపు రానివ్వకుండా చేస్తున్నారని వాపోయారు. కూలీలు ఆందోళన చేస్తుండగా, పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించారు. 
మరిన్ని వార్తలు