అక్కడ రాళ్లే నైవేద్యం

4 Jun, 2017 23:37 IST|Sakshi
అక్కడ రాళ్లే నైవేద్యం

లేపాక్షి మండలంలోని కోడిపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో ఒక కిలోమీటర్‌ దూరం ప్రయాణిస్తే కొత్తపల్లిక్రాస్‌ వద్ద ఉన్న బట్ల బైరవేశ్వర స్వామికి రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ దేవుడికి జంతుబలులు, అభిషేకాలు, అర్చనలు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండవు. ఆ దారి గుండా ప్రయాణించే వారు మూడు రాళ్లను నైవేద్యంగా సమర్పించి వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలా భక్తులు సమర్పించిన రాళ్లు ఓ గుట్టగా పోగయ్యాయి. అయితే దీనికి ఓ ప్రాచీన కథను స్థానికులు నేటికీ వినిపిస్తున్నారు.

అదేమంటే పూర్వం తిరుపతికి పాదయాత్రగా కుటుంబసభ్యులతో బయలుదేరిన బైరవేశ్వరుడనే భక్తుడు.. ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికి చీకటి పడింది. దీంతో ఆ రాత్రికి అక్కడే విడిది చేశారు. తెల్లవారే సరికి భైరవేశ్వరుడు చనిపోయినట్లు గుర్తించి, అక్కడే ఖననం చేశారు. ఆ సమయంలో అతని సమాధిపై ఒక్కొక్కరు మూడు రాళ్లు వేసి వెళ్లారు. మనసులో ఏదైనా కోరుకుని ఇక్కడ మూడు రాళ్లు వేస్తే అవి నెరవేరుతూ వస్తుండడంతో ఆ మరుసటి రోజున కోడి పుంజులను ఇక్కడ బలివ్వడం మొదలు పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
- లేపాక్షి (హిందూపురం)

మరిన్ని వార్తలు