నివేదిక మారిందోచ్‌!

6 Jan, 2017 01:09 IST|Sakshi
నివేదిక మారిందోచ్‌!

మొదటి నివేదికలో భారీ మార్పులు
చక్రం తిప్పిన కొందరుఉపాధ్యాయ సంఘ నాయకులు
వారు పనిచేస్తున్న బడుల్లోబయోమెట్రిక్‌ లేనట్టేనా!
ఒత్తిళ్లకు తలొగ్గిన విద్యాశాఖ అధికారులు
కలెక్టర్‌ దృష్టి సారిస్తే అసలు విషయాలు బట్టబయలు


నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా రావడానికి, విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి సర్కారు బయోమెట్రిక్‌ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు హాజరుశాతంపై మండిపడగా పాఠశాల విద్యాశాఖ బయోమెట్రిక్‌  అందుబాటులోకి   తీసుకురావాలనుకుంటోంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ ప్రణాళిక కూడా రూపొందించింది. మొదటి దశలో 347 పాఠశాలల్లో బయోమెట్రిక్‌ను ప్రారంభించాలని నివేదికలు రూపొందించారు. ఇందులో 290 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు,  కస్తూర్బా 19, రెసిడెన్షియల్‌ స్కూల్‌ 4, మోడల్‌ స్కూల్‌ 9, మదర్సా 6, ఐఈఆర్‌సీ(ఇన్‌క్లూసీవ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ సెంటర్స్‌ 19 పాఠశాలల్లోని విద్యార్థులకు బయోమెట్రిక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నివేదికల్లో తమ పాఠశాలలు ఉండగా ఉపాధ్యాయ సంఘ నాయకులు తొలగింపజేసుకున్నట్లు సమాచారం.

నివేదిక తారుమారు
మొదటి దశకు సంబంధించి గత అక్టోబర్‌లో నివేదికను రూపొందించారు. అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు గైర్హాజరు శాతం అధికంగా ఉన్న పాఠశాలలను, కొందరు సంఘం నాయకులు పాఠశాలలకు వెళ్లకపోవడం, మరికొందరు ఉపాధ్యాయులు ఇతరాత్ర వ్యాపారల్లో నిమగ్నమై పాఠశాలలు రాలేదు. వీటి ఆధారంగా నివేదికను రూపొందించారు. డీఈవో లింగయ్య మారడంతో కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు చక్రం తిప్పారు. ఆ నివేదికలో వారు పనిచేస్తున్న పాఠశాలలు లేకుండా జాగ్రత్త పడ్డారు. మొదటి విడత నివేదికలో నవీపేట, ఆర్మూరు, నిజామాబాద్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, బాల్కొండ, సిరికొండ మండలాల్లో పనిచేస్తున్న కొందరు ప్రధాన సంఘ నాయకుల పాఠశాల పాఠశాలల్లో బయోమెట్రిక్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుత నివేదికలో ఈ పాఠశాలలు లేవు. నిజామాబాద్‌ నగరంలో వివాదాస్పదంగా ఉన్న నాలుగు పాఠశాలలను బయోమెట్రిక్‌కు ఎంపిక చేశారు. ఇందులో ఖలీల్‌వాడి, అర్సపల్లి, శివాజీనగర్, బాలికల పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అందుబాటులో లేదు. దీని వెనుక కొందరు సంఘం నాయకుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

సంఘ నాయకుల ప్రమేయం
అలాగే ఇద్దరు టీచర్లు ఉన్న చోట వంతులవారీగా పాఠశాలకు వెళ్తున్నట్టు తనిఖీలో తేలింది. ఇటువంటి పాఠశాలల్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కొన్నింటినే చేర్చారు. మాలపల్లి, వెంగల్‌రావునగర్‌కాలనీ, కోజాకాలనీ పాఠశాలల్లో మొదట గుర్తించి.. తరువాత వెనక్కి తీసుకున్నారు. జక్రాన్‌పల్లి, నవీపేట, బోధన్‌ ప్రాంతాల్లో అప్పటి డీఈవో ఆకస్మిక తనిఖీలు చేసినపుడు అధిక గైర్హాజరున్నట్లుగా గుర్తించారు. ఇటువంటి కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ ఏర్పాటు చేయలేదు. అలాగే బోర్గాం (పి), దుబ్బ, దారుగల్లి పాఠశాలలు ఎంఈవోలే ఇన్‌చార్జీలుగా ఉన్నచోట బయోమెట్రిక్‌ అవసరమే లేదు. ఎంఈవోలు ఉన్న చోట గైర్హాజరు  ఉండదు. మండలంలోని శివారు పాఠశాలలకు కూడా బయోమెట్రిక్‌కు ఎంపిక చేయలేదు. కలెక్టర్‌కు సమర్పించిన నివేదిక తరువాత కూడా విద్యాశాఖ కార్యాలయంలో మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలిసింది. ఈ బయోమెట్రిక్‌ విధానంను కలెక్టర్‌ పూర్తిస్థాయిలో పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బయోమెట్రిక్‌ నుంచి తప్పించుకున్న ఉపాధ్యాయ సంఘాల నాయకుల బడుల్లో కూడా బయోమెట్రిక్‌ ఏర్పాటు చేయాలని కొందరు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవోను అడుగగా.. బయోమెట్రిక్‌ విధానంలో నిబంధనల ప్రకారమే కొనసాగాం. సంఘ  నాయకుల ఒత్తిడి లేదు. మొదటి దశలో రాని పాఠశాలలు రెండో దశలో చేర్చుతాం.

మరిన్ని వార్తలు