కలెక్టరేట్‌ ముట్టడి

28 Jul, 2016 22:37 IST|Sakshi
ముట్టడించిన టీవీవీ నాయకులు
ఆదిలాబాద్‌ అర్బన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ టీవీవీ నాయకులు, కళాశాలల విద్యార్థులు గురువారం కలెక్టరేట్‌ ముట్టడించారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీవీవీ జిల్లా అధ్యక్షుడు రాహుల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసేత్తడం లేదని ఆరోపించారు. కళాశాలలు ప్రారంభమైన నెలన్నర గడుస్తున్నా మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
 
కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి విద్యార్థులు, నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టర్‌ ఎం.జగన్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ నాయకులు వసంత్, సాగర్, సతీష్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు