వావ్‌..వై ఫై!

23 Jul, 2016 23:20 IST|Sakshi
వావ్‌.. వై ఫై!

►  ఉచిత వై–ఫై వినియోగంపై పెరుగుతున్న ఆసక్తి
► నగరంలో 40 ప్రాంతాల్లో హాట్‌ స్పాట్స్‌
► వినియోగంలో ఎంజీబీఎస్‌ టాప్‌!
► 15 ప్రాంతాలో అత్యధిక డేటా వినియోగం
► 80 రోజుల్లో 4,563.17 జీబీ డౌన్‌లౌడ్‌

సాక్షి, సిటీబ్యూరో: ఉచిత వై–ఫైకి గ్రేటర్‌ సిటీజనులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. నగర వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాటుచేసిన హాట్‌స్పాట్‌లలో మహాత్మగాంధీ బస్‌ స్టేషన్‌(ఎంజీబీఎస్‌) వైఫై వినియోగంలో అగ్రగామిగా నిలిచింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌ ప్రాంగణంలో దూర ప్రాంత ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా అత్యధికంగా ఉచిత వై ఫై సేవలు వినియోగించుకుంటున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.

హైదరాబాద్‌ మహా నగరంలోని సుమారు 40 రద్దీ ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు పొందేందుకు హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 15 హాట్‌స్పాట్స్‌ వద్ద నెట్‌ వినియోగం అధికంగా ఉన్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం హాట్‌స్పాట్‌లలో కలిపి మే నుంచి జూలై 20 వరకు 80 రోజుల వ్యవధిలో సుమారు 87,047 మంది తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా4563.13 గిగా బైట్స్‌ (జీబీ)నిడివిగల సమాచారాన్ని వినియోగించుకునట్లు తెలిసింది.

ఇందులో ఎంజీబీఎస్‌ వద్ద సుమారు 17,534  మొబైల్‌ ఫోన్ల ద్వారా 592.64 జీబీ వినియోగం జరిగింది. ప్రతి హాట్‌స్పాట్‌లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు  80 నుంచి 100 జీబీ వరకు డేటా వినియోగమవుతోంది.  ప్రతిరోజు సుమారు మూడు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు  అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఒక సోషల్‌ మీడియా నిర్వహించిన సర్వేలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు  బెస్ట్‌ రేటింగ్‌ లభించడం విశేషం. ప్రస్తుతం మూ డు రకాలైన స్మాల్, మీడియం, లార్జ్‌ హాట్‌స్పాట్‌లు ఉన్నా యి. ఒక్కో హాట్‌ స్పాట్‌కు ఐదు వైఫై టవర్స్‌ ఏర్పాటు చేసి ఉచిత వైఫై సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పది కిలోమీటర్లకు ఒక జోన్‌గా పరిగణిస్తున్నారు.

మూడుసార్లు ఉచితం..
బీఎస్‌ఎన్‌ఎల్‌ హాట్‌ స్పాట్‌లలో వైఫై సేవలను వినియోగదారులు ఒక మొబైల్‌ ద్వారా నెలకు మూడు సార్లు 15 నిమిషాల చొప్పున ఉచితంగా వినియోగించవచ్చు. ఆ తర్వాత వోచర్‌ బేస్డ్‌ సర్వీసెస్, ఈ–వోచర్‌ బేస్డ్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉంటాయి. ఈ వోచర్స్‌ కోసం డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులను వినియోగించవచ్చు. ఈ సర్వీసులను తక్కువ రేట్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అందుబాటులో ఉంచింది.                                                        

విస్తరణ దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌...
గ్లోబల్‌ స్మార్ట్‌ సిటీలో దిశలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ వైఫై సేవల విస్తరణకు కసరత్తు చేస్తోంది. ఉచిత వైఫై కేంద్రాల ఏర్పాటుకు పర్యాటక. జనరద్దీ ప్రాంతాలను గుర్తించి సుమారు మూడువేల ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 40 ప్రాంతాల్లో ఉచిత వై ఫై సేవలు ప్రారంభించింది. వాస్తవంగా గత ఏడాదిలోగానే పూర్తి స్థాయిలో ఉచిత వైఫై సేవలను విస్తరించాలని నిర్ణయించింది.

కానీ, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖల సహకారం కొరవడడంతో వైఫై విస్తరణకు అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటికే పర్యాటక, జన రద్దీ ప్రాంతాలు, బస్‌ టెర్మినల్స్, ఐటీ కారిడార్, హైటెక్‌ సిటీ, ప్రధాన ఆసుపత్రుల్లో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా వాణిజ్య ప్రాంతాల్లో సైతం విస్తరించేందుకు చర్యలు చేపడుతుంది.

ఎయిర్‌టెల్‌ ప్రస్తుతానికి ఇక్కడే...
ఎయిర్‌టెల్‌ సంస్థ గతేడాది సైబర్‌టవర్స్‌–మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్పై సెబర్‌ టవర్స్‌ టు కొత్తగూడా జంక్షన్, సైబర్‌ టవర్స్‌–రహేజా మైండ్‌స్పేస్‌ సర్కిల్‌ పరిధిలోని  17 కేంద్రాల వద్ద వై–ఫై సిగ్నల్స్‌ను అందించేందుకు హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేసింది.  దాదాపు 8 కి.మీ మార్గంలో  సుమారు 50 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్‌ నిడివిగల వై–ఫై సాంకేతిక సేవలను వినియోగించుకునే సౌకర్యం కలిగింది.

 

మరిన్ని వార్తలు