ఆర్టీసీలో చిల్లర దందా

12 Dec, 2016 15:09 IST|Sakshi
ఆర్టీసీలో చిల్లర దందా

చక్రం తిప్పుతున్న ఓ యూనియన్ నేత
రోజూ కండక్టర్లు తెచ్చే టిక్కెట్ల సొమ్ము పాత నోట్లతో మార్పిడి
ఆ చిల్లర టీడీపీ నేతలకు సమర్పణ
ఇందుకుగాను 15 శాతం కమీషన్!
రోజుకు రూ.4 లక్షలు పక్కదారి

పెద్ద నోట్ల రద్దు దాదాపు అన్ని వర్గాలను కుదిపేస్తోంది. చిల్లర, కొత్త నోట్ల కోసం పడిగాపులు పడేలాచేస్తోంది.. కానీ అధికార టీడీపీకి చెందిన కొందరికి మాత్రం ఇవేవీ వర్తించవు.. ఎందుకంటే చిల్లర నోట్లు వారి కాళ్ల వద్దకే వచ్చి వాలుతున్నారుు.. నిల్వ ఉన్న ‘నల్ల’ నోట్లు కూడా తెల్లబడి పోతున్నారుు.  ఇదంతా ఈ నేతలతో అంటకాగుతున్న ఓ ఆర్టీసీ యూనియన్ నేత చేతి చలవతో చక్కగా సాగిపోతోంది..ఫలితంగా ఆయనగారికి కమీషన్ ముడుతుండగా.. చిల్లర నోట్లు వాస్తవంగా చేరాల్సిన ఆర్టీసీకి పాత నోట్లే అందుతున్నారుు.. చిల్లర పాట్లు కొనసాగుతున్నారుు.

విశాఖపట్నం : పెద్ద నోట్ల రద్దు ఆర్టీసీలో ఓ యూనియన్ నేతకు కాసులు కురిపిస్తోంది. లక్షల రూపాయల అక్రమార్జనకు దోహదపడుతోంది. అధికార టీడీపీకి అంటకాగుతున్న ఆయన ఆ పార్టీకి చెందిన కొంతమంది పెద్దల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బాధ్యతను తలకెత్తుకున్నారు. వాల్తేరు డిపోలో పనిచేస్తున్న ఆయన పేరుకే కండక్టర్. నాయకుని ముసుగులో ఆయన విధుల కంటే నిధులపైనే ఎక్కువ దృష్టి సారిస్తారన్న పేరు గడించారు. యూనియన్ నేత కావడంతో అధికారులు, సాటి కండక్టర్లు, డ్రైవర్లు ఆయన ఏంచేసినా పట్టించుకోరు. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ నేత ఇప్పుడు పెద్ద నోట్ల రద్దును బాగా ’క్యాష్’ చేసుకుంటున్నారు. డిపోకు కండక్టర్లు తెచ్చిన చిల్లర సొమ్మునంతటినీ పోగేసుకు పోతున్నారు. పక్షం రోజుల నుంచి ఈ వ్యవహారాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. 

చిల్లర సేకరణ ఇలా..  : బస్సులు డిపోకు చేరుకున్నాక కండక్టర్లు డిపో కౌంటర్లలో వసూలైన డబ్బును జమ చేయాలి. కానీ ఆ నేత తన వద్ద ఉన్న రూ.500, వెరుు్య నోట్లను షిఫ్టుల వారీగా తన సొంత మనుషుల ద్వారా కండక్టర్లకిచ్చి.. వారు తెచ్చిన చిల్లర నోట్లను తీసుకెళ్లిపోతున్నారు. వాటిని కారులో తరలించుకుపోతున్నారు. ఆర్టీసీ సిబ్బంది ఆయన ఇచ్చిన పెద్ద నోట్లను మారుమాట్లాడకుండా తీసుకొని బ్యాంకులో జమ చేసేస్తున్నారు. సదరు నేత తన పథకాన్ని ఈ డిపో నుంచి పాతపోస్టాఫీసు లింకు కేంద్రానికి విస్తరించారు. అక్కడ ఓ క్లీనర్‌ను తన కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నాడు. వాల్తేరు డిపోకు చెందిన కొన్ని బస్సుల కండక్టర్లు, డ్రైవర్లు అక్కడే డ్యూటీలు మారుతుంటారు. ఆ సమయంలో ఆ క్లీనరు ద్వారా రూ.500, వెరుు్య నోట్లు పంపి కండక్టర్ల వద్ద ఉన్న చిల్లర మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇందుకోసం క్లీనరు షర్టుకు ఓ పెద్ద జేబును కూడా కుట్టించినట్టు చెబుతున్నారు. అంతటితో ఆగని యూనియన్ నేత నోట్ల మార్పిడికి మరో ఎత్తుగడ వేశారు.

కండక్టర్లు డ్యూటీ ఎక్కేటప్పుడు చిల్లరగా రూ.100, రూ.150 వరకు ఇస్తుంటారు. ఆ మొత్తంతో పాటు కండక్టరు వద్ద ఉండే పాకెట్ మనీ (సొంత సొమ్ము) వివరాలను ఎస్సార్‌లో రాస్తారు. కానీ ఇప్పుడు పెద్ద నోట్లు రద్దయ్యాక ఈ నేత ఆ డిపో కండక్టర్లకు ఏకంగా రూ.2 వేల నుంచి 3 వేల వరకు రూ.500, వెరుు్య నోట్లను ఇస్తున్నట్టు కండక్టర్లు చెబుతున్నారు. కండక్టర్లు ప్రయాణికుల నుంచి వచ్చిన చిల్లర స్థానంలో పెద్ద నోట్లను ఉంచి, ఆ సొమ్మును ఆ నేతకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎస్సార్‌లో రూ.500కి మించి నమోదు కాకుండా తాజాగా చర్యలు తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు