ప్రత్యేక హోదాతోనే ఉపాధి అవకాశాలు

14 Nov, 2016 00:38 IST|Sakshi
అనంతపురం : ‘‘ఎన్నికల ముందు  బాబు వస్తే జాబు వస్తుందంటూ ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ. 2 వేల దాకా  నిరుద్యోగ భృతి కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన తర్వాత నిరుద్యోగ యువతను ముఖ్యమంత్రి చంద్రబాబు వంచించారు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల ముందు ఏపీకీ పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నాయకులు అంటే...కాదు కాదు 15 ఏళ్లు ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్పారన్నారు. అలాంటి వారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు మోసాలను యువతకు తెలియజేస్తామన్నారు.  2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయయాదవ్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులంతా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి  వెంటే ఉన్నారన్నారు.

ఇంటికో ఉద్యోగం అన్న బాబు ఉన్న ఉద్యోగాలను పీకేశారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా అనేది సంజీవనా అని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పరుశురాం మాట్లాడుతూ  చంద్రబాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా పర్యటించి అవగాహన  కల్పిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు బి.రామ్మోహన్ రెడ్డి, నార్పల మండల కన్వీనర్‌ రఘనాథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబాసలాం పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు