‘మిట్’మెచ్చిన మాళవిక

7 Sep, 2016 00:08 IST|Sakshi
‘మిట్’మెచ్చిన మాళవిక

బడికెళ్లి చదివింది ఏడో తరగతే..
  అమ్మ పాఠాలతోనే అందలం
  పైసా ఫీజు లేకుండానే ప్రఖ్యాత యూనివర్సిటీలో ప్రవేశం
  మేధస్సుతో మన్ననలు అందుకుంటున్న మాళవిక

 
 చిట్టి తల్లి బడికెళ్లి చదివింది ఏడో   తరగతి వరకే! ఆ తర్వాత ఇల్లే పాఠశాల అయింది!!ఎందుకంటే.. అమ్మ తన పిల్లలకు బడి చదువుల ఒత్తిడి వద్దనుకుంది.. ఇంటి దగ్గరే ఇష్టమైనప్పుడే, నచ్చిందే చదువుకోవాలని భావించింది.పిల్లల కోసం.. చేస్తున్న కొలువు సైతం వదిలి తనే టీచర్‌గా మారింది..ఆ అమ్మ కృషి వృథా కాలేదు. మాళవిక తనకు ఇష్టమైన ఇన్ఫర్మేటిక్స్‌లో దూసుకెళ్లింది. ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్స్‌లో వరుసగా మూడేళ్లు పతకాలు సాధించింది. ఆమె మేధస్సును ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) మెచ్చింది. నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్ ప్రోగ్రామ్‌లో చేరమంటూ ఆఫర్ లెటర్ అందించింది. పైసా ఫీజు కట్టకుండా పూర్తిగా స్కాలర్‌షిప్‌తో చదువుకోవాలంటూ ఆహ్వానించింది. మిట్‌ను మెప్పించిన ముంబైకి చెందిన మాళవిక జోషి సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే..
 
 అందరూ మిట్ అని పిలిచే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చదువుకునే అవకాశం రావడం చాలా సంతోషం కలిగించింది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో వరుసగా మూడేళ్లు పతకాలు సాధించడం వల్ల మిట్ వాళ్లే నేరుగా సంప్రదించి బీఎస్ కోర్సులో పూర్తి స్కాలర్‌షిప్‌తో సీటు ఆఫర్ చేశారు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.  వాస్తవానికి నేను ఎలాంటి సర్టిఫికెట్లు, కోర్సులు పూర్తిచేయకుండానే.. ఎంఐటీకి ఎంపిక కావడం వెనుక అమ్మ సుప్రియ జోషి కృషి ఎంతో ఉంది. పిల్లలను మూస ధోరణి, ఒత్తిడితో కూడుకున్న బడి చదువులకు బదులు వారికి ఇష్టమైన రీతిలో చదివించాలని అమ్మ తీసుకున్న నిర్ణయమే నా విజయానికి కారణం.
 
 ఇష్టమైన రంగంవైపే అడుగులు వేయాలి
 మనకు నచ్చిన రంగం వైపు అడుగులు వేస్తే.. అందులో ప్రతిభా పాటవాలు చూపడం ఎంతో సులభం. తద్వారా ఏదో ఒకరోజు తమదైన ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో అమ్మానాన్న ముఖ్యంగా అమ్మ సుప్రియ నాకు, నా చెల్లెలు రాధకు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిది. ఎంతమంది విమర్శించినా.. చివరకు నాన్న సైతం ఆందోళన చెందినా.. తాను మాత్రం బెదరకుండా మమ్మల్ని పాఠశాల మాన్పించి ఇంట్లోనే మాకు ఇష్టమైన కోర్సులు చదివేలా చేసింది. అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. చెల్లెలు రాధ కూడా ముంబైలోని ప్రతిష్టాత్మక గ్జేవియర్ కాలేజ్‌లో ప్రవేశం సొంతం చేసుకుంది.
 
 ఒత్తిడి వద్దనే
 అమ్మ సుప్రియ జోషి, ఒక స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేసేది. నాన్న రాజ్ జోషి ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలోనే సొంత వ్యాపారం చేస్తున్నారు. అమ్మ తాను పనిచేసే స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్న పిల్లలు ఎదుర్కొంటున్న బడి పాఠాల ఒత్తిడిని, దానివల్ల వారికి ఎదురవుతున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. తన పిల్లల(నేను, చెల్లెలు రాధ) కు ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని భావించింది. అంతే మమ్మల్ని బడి మాన్పించి ఇంట్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అందుకోసం అమ్మ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసింది.
 
 ఇల్లే పాఠశాల
 నేను దాదర్ పార్శీ యూత్ అసెంబ్లీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నప్పుడు మమ్మల్ని బడి మాన్పించేయాలని అమ్మ నిర్ణయం తీసుకుంది.  అప్పటి నుంచి మాకు ఇల్లే పాఠశాల అయింది. చాషక్ గురుకుల్ పేరుతో ఇంట్లోనే ప్రత్యేకంగా హోం స్కూలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసింది. మా ఆసక్తికి అనుగుణంగా చదువుల్లో రాణించడం కోసం పలు పుస్తకాలు శోధించి ప్రత్యేకంగా సొంత కరిక్యులం రూపొందించింది. ఇలా.. అడుగడుగునా మాకిష్టమైన విధంగా చదివే ఏర్పాట్లు చేసింది అమ్మ. అయితే అమ్మ నిర్ణయాన్ని చాలా మంది విమర్శించారు. సరైన నిర్ణయం కాదనన్నారు. అయినా అమ్మ బెదరలేదు. మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. మీకు ఇష్టమైన చదువు చదవండి.. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చింది. ఆ భరోసానే ఇప్పుడు నన్ను మిట్‌లో అడుగుపెట్టేలా చేసింది.
 
 శిక్షణకు సైతం అంగీకరించని ఇన్‌స్టిట్యూట్‌లు
 స్కూల్ మానేసిన వెంటనే నాకు ఇష్టమైన ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్ సైన్స్, విండ్ సర్ఫింగ్ విభాగాల్లో రాణించాలని భావించాను. అందుకోసం నిర్వహించే పలు జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు హాజరవ్వాలి. అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలని భావిస్తే.. ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్ కూడా నాకు అనుమతి ఇవ్వలేదు. ఇందుకు వాళ్లు చెప్పిన కారణం ఒకటే.. చేతిలో కనీసం పదో తరగతి సర్టిఫికెట్ కూడా లేదు, నిబంధనలు అంగీకరించవు.
 
 సీఎంఐలో శిక్షణ
 ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్ కూడా కనీసం శిక్షణనివ్వడానికి సైతం అంగీకరించని పరిస్థితిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఐ) నాకు వరంలా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ భారత కో-ఆర్డినేటర్ సీఎంఐ ప్రొఫెసర్ మాధవన్ ముకుంద్ సహకారం మరువలేనిది. ఆయన్ను సంప్రదించగా నా ప్రతిభను పరీక్షించి శిక్షణకు అంగీకరించారు. సీఎంఐలో శిక్షణకు చేరిన తొలి ఏడాదిలోనే అంటే 2013లోనే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ నేషనల్ ట్రైనింగ్ క్యాంప్‌నకు ఎంపికయ్యాను. దాంతో ప్రొఫెసర్ మాధవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అల్గారిథమ్స్, మ్యాథమెటిక్స్ మెళకువలు నేర్పించారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌కు సర్వం సన్నద్ధం అయ్యేలా శిక్షణనిచ్చారు.
 
 ఎంఐటీ నుంచి పిలుపు
 సీఎంఐలో శిక్షణతో 2014 నుంచి ఇన్ఫర్మేటిక్స్‌లో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌కు హాజరవుతున్నాను. తొలి రెండు సంవత్సరాలు (2014, 2015)లలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్స్‌లో రజత పతకం; మూడో సంవత్సరం (2016)లో కాంస్య పతకం సొంతమైంది. అల్గారిథమ్స్ వినియోగించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ రూపకల్పనలో చూపిన ప్రతిభకు ఈ పతకాలు లభించాయి. దీంతో అమెరికాలోని మిట్ సహా పలు యూనివర్సిటీలు బీఎస్ కోర్సులో డెరైక్ట్ అడ్మిషన్ ఇస్తామంటూ ముందుకొచ్చాయి. ఎంఐటీ నిబంధనల ప్రకారం- వరుసగా మూడు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో టాప్‌లో నిలిచిన వారికి నేరుగా బీఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. నాకు ఎంఐటీ నుంచి  2015లోనే ఆహ్వానం వచ్చింది. మూడో ఒలింపియాడ్‌లో విజయం సాధిస్తే మేం సీటు ఇవ్వడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు. దానికి తగ్గట్లుగానే 2016 ఒలింపియాడ్‌లోనూ విజయం సాధించడంతో మిట్‌లో సీటు ఖాయం అయింది.
 
 బీఎస్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్
 నాలుగేళ్ల బీఎస్ కంప్యూటర్ సైన్స్‌లో డెరైక్ట్ అడ్మిషన్‌తోపాటు ఎంఐటీ కల్పించిన మరో సదుపాయం.. ఆ నాలుగేళ్ల కోర్సును ఉచితంగా ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం లేకుండా పూర్తిగా స్కాలర్‌షిప్ మంజూరు చేయడం. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఎంఐటీ ఈ నిర్ణయం తీసుకుంది. పదిహేను రోజుల క్రితమే ఎంఐటీలో అడుగుపెట్టాను.
 
 ‘తల్లిదండ్రులు తమ పిల్లల ఇష్టానికి, ఆసక్తికి అనుగుణంగా వ్యవహరించి తోడ్పాటునందిస్తే అందలాలు అందుకుంటారనడానికి ప్రత్యక్ష తార్కాణం.. మాళవిక జోషి. బోర్డ్ పరీక్షలు సైతం పూర్తి చేయకున్నా.. సర్టిఫికెట్లు లేకున్నా.. ఇన్ఫర్మేటిక్స్‌లో వ్యక్తిగత ఆసక్తితో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ఎంఐటీలో అడుగుపెట్టింది. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నిజమైన ఆసక్తిని గ్రహించాలి. బడి చదువులతోనే జ్ఞానం వస్తుందనే భావన సరికాదు. కానీ, మన వ్యవస్థలో పదో తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లు లేకుంటే కనీసం దరఖాస్తుకు కూడా అనుమతించని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో కొంత మార్పు తేవాలి.’
 - సుప్రియ జోషి, (మాళవిక జోషి తల్లి)
 

>
మరిన్ని వార్తలు