సీటు మారినా.. రాత మారేనా!

21 Apr, 2014 02:19 IST|Sakshi
సీటు మారినా.. రాత మారేనా!

గతంలో పోటీ చేసిన స్థానాలు వదిలి కొత్త చోట్ల నేతల పోటీ
ఓటమి భయంతో కొందరు..
విజయం కోసం మరికొందరు
సీటు మారిన వారిలో కేసీఆర్, జైపాల్, జేపీ, మోత్కుపల్లి, విజయశాంతి, నాగం వంటి ప్రముఖులు

 
  హైదరాబాద్: సీటు మారితేనైనా రాత  మారుతుందేమోనన్న ఆశ... వలస వెళితేనైనా విజయం వరిస్తుందనే నమ్మకం.. ఇప్పటికే ఎన్నికైన చోట పోటీ చేస్తే గెలుస్తామో లేదోనన్న అనుమానం.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్న భయం.. వెరసి రాష్ట్రంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు వలసల బాట పట్టారు. ఇప్పటిదాకా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలను వదిలి, కొత్త స్థానాలకు మారారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు మొదలుకుని రాష్ట్ర, జిల్లా స్థాయిలో హవా నడిపించిన నాయకుల వరకు పలువురు ప్రముఖులు కూడా ఈ వలస జాబితాలో ఉన్నారు. మారిన చోట స్థానిక నాయకులతో పరిచయాలు, వారిని మచ్చిక చేసుకునే యత్నాల్లో కొందరికి పుణ్యకాలం గడిచిపోతోంటే.. మరికొందరు ముందస్తు వ్యూహంగానే సీట్లు మారారు.

 సీటు మారిన ప్రముఖులు..

 ఈ సారి సీట్లు మారిన ముఖ్య నాయకుల్లో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్‌ఎస్ నాయకులు కడియం శ్రీహరి, మైనంపల్లి హన్మంతరావు, కొండా సురేఖ, జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజయశాంతి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ తదితరులు ఉన్నారు.
 
2009 సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి ఇద్దరూ ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దనరెడ్డి కూడా ఈ సారి మహబూబ్‌నగర్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. అయితే జైపాల్‌రెడ్డికి ఈసారి ఇంటిపోరుతో అనుకున్న స్థాయిలో దూసుకెళ్ల లేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి ప్రచారంలో జోరుమీద ఉన్నారు. గతంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన అబ్దుల్ రెహ్మన్  కూడా స్థానం మార్చి మహబూబ్‌నగర్ లోక్‌సభ కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
 
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ 2009లోనూ ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలవడంతో... ఈ సారి నిజామాబాద్ రూరల్ స్థానానికి మారారు. ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో తలపడుతున్నారు.
 
ఇక కేసీఆర్ తాను పోటీ చేసిన చోట మళ్లీ పోటీ చేయరనే అభిప్రాయం ఇప్పటికే ఉంది. ఆయన సీటు మారిన ప్రతీసారీ గెలుస్తూనే ఉండడం ఆయన బలంగా చెబుతున్నారు. గత సారి మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి గెలిచిన కేసీఆర్.. ఈసారి మెదక్ లోక్‌సభతో పాటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. మెదక్ లోక్‌సభ స్థానంలో ఆయనతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరేంద్రనాథ్ పోటీలో ఉన్నారు.
 
గతంలో మెదక్ లోక్‌సభకు పోటీ చేసిన విజయశాంతి ఈ సారి మెదక్ అసెంబ్లీ స్థానానికి మారారు. ఇక్కడ మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు శశిధర్‌రెడ్డి మనస్ఫూర్తిగా పని చేయడంపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాంతోపాటు టీఆర్‌ఎస్ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు.

నల్లగొండ జిల్లా ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఈ సారి ఖమ్మం జిల్లా మధిరకు మారి.. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో తలపడుతున్నారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి పోటీలో ఉన్నారు.
 
గత ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య.. ఈ సారి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరఫున పోటీ పడుతున్నారు. ఆలస్యంగా వచ్చినా.. ప్రచారంలో తనదైన శైలితో ముందుకెళుతున్నారు.
 
వరంగల్ జిల్లా పరకాల నుంచి గెలుస్తూ వచ్చిన కొండా సురేఖ ఈ సారి వరంగల్ (తూర్పు) స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఆమె అక్కడ మంత్రి బస్వరాజు సారయ్యతో పోటీ పడుతున్నారు. ఇక్కడ ముస్లింల ఓట్లు కీలకం కావడంతో... ఆ ఓట్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి.

గతంలో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేస్తూ వచ్చిన కడియం శ్రీహరి.. ఈసారి వరంగల్ లోక్‌సభకు ప్రస్తుత ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పోటీలో ఉన్నారు. తొలిసారిగా ఎంపీగా గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉండి, ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన నంది ఎల్లయ్య ఏకంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభకు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన మందా జగన్నాథంతో తలపడుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు