'మోడీ పెళ్లి 50 ఏళ్ల కిందటి ఓ సామాజిక లాంఛనం'

10 Apr, 2014 21:05 IST|Sakshi

 డోదరా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (63) వివాహాన్ని సుమారు 50 ఏళ్ల కిందట జరిగిన ఒక సామాజిక లాంఛనంగానే చూడాలని మోడీ పెద్దన్నయ్య సోమాభాయ్ ఓ ప్రకటనలో కోరారు. గుజరాత్‌లోని వడోదరా లోక్‌సభ స్థానానికి బుధవారం దాఖలు చేసిన నామినేషన్‌లో తాను వివాహితుడినని  నరేంద్ర మోడీ తొలిసారి ప్రకటించిన విషయం తెలిసిందే. తన భార్య పేరును జశోదాబెన్ (62)గా కూడా ఆయన  పేర్కొన్నారు. తన వైవాహిక స్థితిపై రాజకీయంగా జరుగుతున్న చర్చకు  మోడీ స్వయంగా తెరదించారు.
 
 నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఆయనకు సోదరులు సోమాభాయ్, ప్రహ్లాద్‌లు బాసటగా నిలిచారు. పెద్దగా చదువుకోని తమ తల్లిదండ్రులు పేదరికం కారణంగా మోడీకి చిన్న వయసులోనే పెళ్లి చేశారని పెద్దన్నయ్య సోమాభాయ్  పేర్కొన్నారు. స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుని నుంచి స్ఫూర్తి పొందిన మోడీ...వసుదైక కుటుంబమనే సిద్ధాంతాన్ని నమ్మి దేశ సేవ కోసం ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌కే జీవితాన్ని అంకితం చేశారన్నారు.  నాటి నుంచి మోడీ కుటుంబానికి దూరంగా ఉన్నారని తెలిపారు.  జశోదాబెన్ కూడా టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారని,  ప్రస్తుతం ఆమె తన తండ్రి వద్దే ఉంటున్నారని వివరించారు. మరో సోదరుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ మోడీ ఎప్పుడూ పెళ్లయిన విషయాన్ని దాచలేదన్నారు.
 

మరిన్ని వార్తలు