ఓట్ల లెక్కింపునకు 1320 మంది

11 May, 2014 03:34 IST|Sakshi

- 14న సిబ్బందికి శిక్షణ
 చిత్తూరు(జిల్లాపరిషత్)న్యూస్‌లైన్: జిల్లాలో ఈనెల 7వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రం చిత్తూరులో మూడు కాలేజీల్లో ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.రాంగోపాల్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు (రాజంపేట, చిత్తూరు, తిరుపతి) లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బంది ఎంపికను పూర్తి చేశారు. దీనికి గాను జిల్లాలో 1320 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు విధులకు ఎంపిక చేశారు. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో పోలైన అసెంబ్లీ, లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు మొత్తం 364 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

మూడు చోట్ల ఓట్ల లెక్కింపు
జిల్లాలోని చిత్తూరు, రాజంపేట, తిరుపతి లోక్‌సభ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును చిత్తూరులోని శ్రీనివాస ఇన్‌స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీటమ్స్),  ఒకే క్యాంపస్‌లో ఉన్న ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆర్‌కేఎం లా కాలేజీలో నిర్వహించనున్నారు.
 శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టె క్నాలజీలో తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూ రు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను లెక్కిస్తారు.

ఆర్‌కేఎం లా కాలేజ్ క్యాంపస్‌లో పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గాను అసెంబ్లీకి 86 టేబుళ్లు, లోక్‌సభకు పోలైన ఓట్ల లెక్కింపునకు 86 టేబుళ్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులోని శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల జీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో  చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని చంద్రగిరి, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పంతో పాటు, తిరుపతి అసెంబ్లీ ఓట్లను లెక్కిస్తారు. ఈ కేంద్రంలో అసెంబ్లీ కౌంటింగ్‌కు 98 టేబుళ్లు, లోక్‌సభకు 94 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 1320 మంది ఉద్యోగులను ఉపయోగించనున్నారు.

14న శిక్షణ
జిల్లాలో 16వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎంపిక చేసిన కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మపరిశీలకులకు బుధవారం చిత్తూరులోని మహతి ఆడిటోరియంలో శిక్షణ  కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కే.రాంగోపాల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎంపికైన సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, సిబ్బంది అందరూ సకాలంలో ఈ శిక్షణ  కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు

>
మరిన్ని వార్తలు