ఆయనది యజ్ఞం ... వీరిది విఘ్నం

1 Apr, 2014 02:16 IST|Sakshi

అదొక అద్భుత సంకల్పం. దివి నుంచి గంగను తెలుగునేలకు రప్పించే భగీరథ యత్నం. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం. కోటి ఎకరాలకు సాగునీటిని అందించి, రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి మహానేత తీసుకున్న దృఢ నిర్ణయం. అదే.. జలయజ్ఞం! రూ.1.31 లక్షల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 86 సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమం. మహానేత  హయాంలో పరుగులు తీసిన ఈ బృహత్తర యజ్ఞం అనంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది.
 
బి. నారాయణరెడ్డి: వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో వరుసగా కరువు కాటకాలు. పంటలు పండక రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రకృతి ప్రకోపానికి పాలకుల నిర్లక్ష్యం తోడు కావడంతో పెద్దఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాంతో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. అందుకు వీలుగా భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. తన హయాంలోనే పలు ప్రాజెక్టులను పూర్తి చేసి, పొలాలకు సాగునీటిని అందించారు. అనేక ప్రాజెక్టుల పనులు చివరి దశకు చేరుకున్నాయి. వైఎస్ అనంతరం పరిస్థితి మారింది. ప్రాజెక్టులను పట్టించుకున్న నాథుడు లేడు. చివరి దశలోని ప్రాజెక్టుల నిర్మాణాలు సైతం సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. ఒక్క ఎకరానికి అదనంగా చుక్క నీటిని అందించలేదు.    
 
 వైఎస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులు
 వైఎస్ హయాంలో పాక్షికంగా పూర్తయి నీటిని విడుదల చేసిన ప్రాజెక్టులు    
 ఆయకట్టు ఎకరాలలో..
 
 పోలవరం:  రాజశేఖరరెడ్డి హయాంలోనే వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు...తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్‌ను మార్చడం వల్ల మళ్లీ టెండర్లను ఖరారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ టెండర్లను ఖరారు చేయడానికే ప్రభుత్వం మూడేళ్ల సమయాన్ని తీసుకుంది. అది కూడా వివాదాస్పదం కావడంతో ప్రాజెక్టు పనులపై తీవ్ర ప్రభావం పడింది. వైఎస్ మొద లు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే.. ఈ సమయానికి పూర్తయి.. పశ్చిమగోదావరి జిల్లాలో 7.2 లక్షల అయకట్టుకు నీటి  వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలి ంచడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది.  
 
 ప్రాణహిత  - చేవెళ్ల
 తెలంగాణలోని ఏడు జిల్లాలకు సాగునీటిని అందించడంతో పాటు, హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా వైఎస్ తరువాతి ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. ఈ ఐదేళ్లు ప్రాజెక్టు పనులు జరిగి ఉంటే.. ఈ సమయానికి గోదావరి నీరు తెలంగాణ జిల్లాలకు పారేది.
 
 దుమ్ముగూడెం
 గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి ఉద్దేశించిన దుమ్ము గూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. దీనిని అనధికారికంగా పక్కన పెట్టారు. వైఎస్ తర్వాత ఒక్క పైసా కూడా ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. గోదావరి నది నుంచి సుమారు 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌లోకి తరలించడానికి అవకాశం ఉంది. ఫలితంగా కృష్ణా బేసిన్‌పై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులకు నీటి లభ్యత ఏర్పడేది.
 
 బాబు పాలనలో..
 -    కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది.
-     కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టు లను అప్పట్లోనే నిర్మించి ఉంటే  ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది.
-     పలు ప్రాజెక్టులకు శంకు స్థాపన మాత్రం చేశారు.
-     బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు.
-     ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు.
 
 వైఎస్ హయాంలో..
-     జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు.
-     ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు.
-     చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి.
-     పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి.
 
 రోశయ్య, కిరణ్‌ల పాలనలో..

-     జలయజ్ఞం పనులను పట్టించుకోలేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపారు.
-     కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేశారు.
-     కొద్దిగా నిధులను కేటాయించి, సరిగ్గా పర్యవేక్షిస్తే... నెలల్లోనే పూర్తయ్యే ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.
-     రోశయ్య హయాంలో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో విభజించారు. ఈ జాబితాలో లేని ప్రాజెక్టులను గాలికొదిలేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపారు.
 -    ఆ తరువాత సీఎం కిరణ్‌దీ అదే తీరు.
-     ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో ప్రాజెక్టులు పడకేశాయి.

మరిన్ని వార్తలు