కుమారి తోడుంటే కళ్లెందుకు?

1 Apr, 2017 23:39 IST|Sakshi
షూటింగ్‌ లొకేషన్లో డ్యాన్స్‌ మాస్టర్‌ రాజు సుందరం తదితరులు

కుమారి హెబ్బా చాలా అందగత్తె. కానీ, ఏం లాభం? రాజ్‌తరుణ్‌ ఆమె అందాన్ని చూడలేడు. ఎందుకంటే దేవుడు మనోడికి చూపు ఇవ్వలేదు, గుడ్డివాడు అన్నమాట. అయినా... రాజ్‌తరుణ్‌ ఇటలీ వెళ్లాడు. మాంచి రొమాంటిక్‌ సాంగేసుకున్నాడు. గుడ్డివాడు కదా... ఇటలీ ఎలా వెళ్లాడు? ఎలా సాంగేసుకున్నాడు? స్టెప్పులు ఎలా వేస్తున్నాడు? అనుకుంటున్నారా! కుమారి లాంటి అందగత్తె తోడుంటే కళ్లెందుకు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు రాజ్‌తరుణ్‌. మనసుతో విదేశీ అందాలను ఆస్వాదిస్తున్నా అంటున్నారు.

‘కుమారి 21ఎఫ్‌’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాల తర్వాత రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న మూడో సినిమా ‘అంధగాడు’. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఏటీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం నేతృత్వంలో ఇటలీలో పాటలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 5తో ఇటలీ షెడ్యూల్‌ పూర్తవుతుంది. మే 26న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి కిశోర్‌ గరికపాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత, అజయ్‌ సుంకర సహ నిర్మాత, శేఖర్‌ చంద్ర స్వరకర్త.

మరిన్ని వార్తలు