త్రీడీ గేటెడ్‌ కమ్యూనిటీకి రంగం సిద్ధం...

17 May, 2019 00:46 IST|Sakshi

మీకు తెలుసా...? ప్రపంచం మొత్తమ్మీద దాదాపు వంద కోట్ల మందికి ఉండటానికి ఇల్లు లేదు. చాలీచాలని సంపాదన ఉన్న వీళ్లు భవిష్యత్తులోనూ ఇల్లు కట్టుకునే అవకాశమే లేదు. ప్రభుత్వ స్కీముల ద్వారా మాత్రమే ఓ ఇంటివారయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతమందికి గూడు కట్టి ఇవ్వాలంటే ప్రభుత్వాలకూ బోలెడంత ఖర్చు అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని వాడుకోవాలని ఆలోచిస్తోంది లాటిన్‌ అమెరికన్‌ కంపెనీ ఒకటి. ఈ సరికొత్త కార్యక్రమానికి పెట్టిన పేరు ఫూయ్జ్‌ ప్రాజెక్ట్‌. త్రీడీ టెక్నాలజీని ఇంటి నిర్మాణంలో వాడుకోవాలన్నది పాత ఆలోచనే గానీ.. ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ టెక్నాలజీలో గణనీయమైన మార్పులు వచ్చాయి.

ఒక్క రోజులోనే పది ఇళ్లను కట్టడం.. ఆఫీసు భవనాలను.. కోటలాంటి నిర్మాణాన్ని కట్టేందుకు విజయవంతంగా ఉపయోగించారు కూడా. ఈ నేపథ్యంలో ఐకాన్‌ అనే కంపెనీ ఫ్యూజ్‌ ప్రాజెక్టు సాయంతో లాటిన్‌ అమెరికా దేశాల్లోని పేదలకు చౌకగా ఇళ్లు కట్టివ్వాలన్న ప్రయత్నం మొదలుపెట్టింది. సిమెంటు కాంక్రీట్‌ను పొరలు పొరలుగా పేరుస్తూ గోడలను నిర్మించడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశం. ప్రాజెక్టు మొదలయ్యేందుకు ముందు ఐకాన్‌ తాను అభివృద్ధి చేసిన తాజా త్రీడీ ప్రింటర్‌తో నిర్మించిన ఇంటికి అయిన ఖర్చు సుమారు ఏడు లక్షలు మాత్రమే. దాదాపు 350 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని రూ.7 లక్షల్లో కట్టడం సాధ్యం కాదన్నది మనందరికీ తెలుసు. ఐకాన్‌ త్రీడీ ప్రింటర్‌ వల్కన్‌ –2 కాంక్రీట్‌తో గోడలు నిర్మిస్తే.. తలుపులు, కిటికీలు, ప్లంబింగ్‌ తదితర హంగులను మానవులు సమకూరుస్తారన్నమాట.

మరిన్ని వార్తలు