ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

9 Jun, 2017 23:04 IST|Sakshi
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని కమ్ముకున్న తెలుగు తిరుగుబాటు మేఘాలు. ఆ ఉరుములు గర్జించిన ఒకే ఒక్క పేరు... ఉయ్యాలవాడ. తెల్ల గుండెల్లో పిడుగు బల్లెం దింపి ధీర పతాకం ఎగరేసిన నరసింహారెడ్డి ఊరే... ఉయ్యాలవాడ. స్వాతంత్య్ర ఉద్యమానికి ఉయ్యాలలోనే మంత్రోపదేశం చేసిన వీరవాడ! ఆ వాడలో దుమ్ము రేపిన గిట్టల ధూళి సమరయోధుల నుదుటిన రుధిర తిలకంగా అద్దుకుంది. తల... ఉంటే బలమైన బాహువుల మీద ఉండాలి. లేకుంటే... కోట గుమ్మానికి అలంకారం కావాలి. స్ఫూర్తికి ఆహ్వానం కావాలి.

మల్లారెడ్డితో పథకం షురూ..!
అది 1847వ సంవత్సరం. బ్రిటీష్‌ దొర కాక్రేన్‌ నివాసం. అందరూ బానిసలే. చుట్టూ తిరుగుతున్న వారందరూ బానిసలే. ఆ మధ్యలో ఓ పదిమంది తెల్లదొరలు. వారిపక్కనే అందమైన దొరసానులు. ఠప్‌మని బాటిల్‌ ఓపెన్‌ అయింది. బందూక్‌లోనుంచి బుల్లెట్‌లా వచ్చింది షాంపైన్‌ బాటిల్‌ మూత. కోటలోకి వస్తున్న మల్లారెడ్డికి ఎదురైన గన్‌ సెల్యూట్‌ అది. దొర బానిసలు దారి చూపించగా, చుట్టూ పరికిస్తూ కాక్రేన్‌ దొర వద్దకు చేరాడు మల్లారెడ్డి. అక్కడి పార్టీ వాతావరణం,పియానో సంగీతం మల్లారెడ్డికి కొత్తగా అనిపించాయి.‘కమ్‌ మల్లారెడ్డి.. వెల్‌కమ్‌.’ అన్నాడు కాక్రేన్‌. వంగి వంగి దండాలు పెడుతూ కాక్రేన్‌ను సమీపించాడు మల్లారెడ్డి. ‘ఎంజాయ్‌ షాంపైన్‌?’ అంటూ మల్లారెడ్డి చేతికి గ్లాస్‌ అందించాడు. బుడగలు వేస్తున్న గ్లాసును వింతగా చూశాడు మల్లారెడ్డి. కాక్రేన్‌... పక్కనే ఉన్న భామతో, ‘మల్లారెడ్డి. మన తె..ల్ల..వా..రికి సాయం చేస్తున్న లె...లు..గువాడు.’ అంటూ మల్లారెడ్డిని చూపించాడు.

పూర్తిగా మత్తెక్కే స్థాయిలో తాగేశాడు మల్లారెడ్డి. దొరసానుల్లో ఒకామె వచ్చి మల్లారెడ్డి పక్కన కూర్చుని కూని రాగాలు తీస్తోంది.‘ఎక్క..డుంటాడు న..ర..సింహారెడ్డి? నీకు మంచి బహుమానం ఇస్తా’ అంటూ దొరసానిని మల్లారెడ్డి మీదకు నెట్టాడు కాక్రేన్, నవ్వుతూ. ‘చెప్తా దొరా..! నరసింహారెడ్డి ఇప్పుడు వనదుర్గం దగ్గర ఉన్నాడు’ మల్లారెడ్డి మత్తుగా పలికాడు. మర్నాడే రెండువేలæమంది సైన్యాన్ని వెంటేస్కొని, మల్లారెడ్డితో వనదుర్గం వైపుకు బయలుదేరాడు కాక్రేన్‌ దొర. ‘దొరా! నేనీడకుమించి రాలేను. ఆ నరసింహారెడ్డి అడుగుజాడ తెలిస్తినే నా గుండె అదురుతాది. చూసినానంటే నేను చచ్చేపోతా’ అంటూ మల్లారెడ్డి గుర్రం దిగి పారిపోయాడు.

మా దేవుడు.. మా స్వామి..!
జగన్నాథ ఆలయ ప్రాంగణం. నరసింహారెడ్డి అడుగు పెట్టడంతోనే అక్కడి జనమంతా.. ‘అదిగో వచ్చె.. ఇదిగో వచ్చె.. నారసింహారెడ్డిపళపళ పళపళ కేకలేసెరా నారసింహారెడ్డి..’ అంటూ ఆ జగన్నాథుడికి సాటిగా కీర్తిస్తున్నారు. ‘ఎవరు తాతా నారసింహారెడ్డి? ఆయన మనకి దేవుడెట్లా అయినాడు?’ ఓ పిల్లవాడు ఓ తాత పంచచుట్టూ చేరి మెల్లిగా అడిగాడు.

ఫ్లాష్‌బ్యాక్‌..
బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించిన జయరామిరెడ్డి మనవడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చిన్ననాటి నుంచే కత్తి చేత పడితే భూమి మీద పిడుగులు కనపడేవి. గుర్రపు స్వారీని ఓ ఆటగా మార్చేసుకున్నాడు. తన కోట పరిధిలో ఉన్న మొత్తం 60కి పైగా గ్రామ ప్రజల మంచి – చెడు చూసేవాడు. నరసింహారెడ్డి కళ్ళల్లో ఎంత పొగరుంటుందో, గుండెల్లో అంత తీపి ఉంటుంది. ఈ ధీరత్వం సిద్ధమ్మకు తెగ నచ్చేసింది. ‘నే వలచిన ధీరుడవు నీవే’ అంటూ నరసింహారెడ్డిని ప్రేమలోపడేలా చేసింది. కత్తికి పడనివాడు, సిద్ధమ్మ కంటికి పడ్డాడు. రెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకున్న నరసింహారెడ్డి అక్కడి ప్రజలకు ఓ దేవుడయ్యాడు. అతని దాయాది మల్లారెడ్డికి మాత్రం కంట్లో నలుసయ్యాడు.
            
మొదటి తిరుగుబాటు!
1845వ సంవత్సరం. ఓ మధ్యాహ్నం. తనకు రావాల్సిన తవర్జీని తీసుకురమ్మని నరసింహారెడ్డి తన సైనికుడిని కోవెలకుంట్ల తహశీల్దార్‌దగ్గరకు పంపాడు.‘మా నరసింహారెడ్డి దొర తవర్జీని నాకిచ్చి  పంపమన్నాడు’ తహశీల్దార్‌ రాఘవచారినిఅడిగాడు సైనికుడు.‘ఏందీ? నీకు దొరా? ఆ దొరనే వచ్చి తీసకపొమ్మను.’ అన్నాడు రాఘవాచారి. బ్రిటీష్‌ సైనికులు కొందరు నరసింహారెడ్డి సైనికుడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు.‘మా దొరనే అవమానిస్తావా!’ అంటూ అక్కడే ఉన్న చెక్క మొద్దుతో రాఘవాచారిని కొట్టాడు సైనికుడు. మరో పదిమంది బ్రిటీష్‌ సైనికులను చావబాదాడు. కోపంతో ఊగిపోయిన రాఘవచారి సైనికుడిని కాల్చి చంపమని ఆదేశించాడు.

నరసింహారెడ్డి సైనికుడి శవాన్ని, అతడు వచ్చిన గుర్రం మీదనే పంపి ‘నీకింక ఏ తవర్జీ ఇవ్వట్లేదు’ అన్న సందేశాన్ని చేరవేశాడు రాఘవచారి. నరసింహారెడ్డి గుర్రం వేగం మేఘాలతో మాట్లాడుతోంది. నరసింహారెడ్డి జోరు యమదూతలతో మాట్లాడుతోంది. గిట్టల హోరు కట్టలు దాటుతోంది. ఉయ్యాలవాడ... రాఘవచారి గుండె చెరచడానికి సవారి అయ్యాడు. ‘కోబలీ.. రణబలీ..’ అంటూ పొలిమేర చేరాడు. అతని సైగ మేరకు పొలిమేరల్లోనే ఆగిపోయింది సైన్యం. ఒక్కడే రాఘవచారి ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్నాడు నరసింహారెడ్డి. ఉరుములు, మెరుపులతో ఆ ప్రాంతమంతా నరసింహారెడ్డి ఉగ్రరూపాన్ని దర్శించింది. కోట చుట్టూ ఉన్న బ్రిటీష్‌ సైన్యాన్ని తెగనరుకుతూ రాఘవాచారి దగ్గరకు చేరాడు నరసింహారెడ్డి.

ఓ గదిలో దాచుకొని భయపడుతోన్న రాఘవాచారిని బయటకు లాగి, ‘నువ్వు చంపింది నా సైనికుడిని కాదు! వాడు నా రక్తం. ఆ రక్తమింకా ఆరకముందే నువ్వు చావాలి!’ ఒక్క దెబ్బలో రాఘవాచారి తల నరికాడు. వెనకనుంచి వచ్చిన ఓ బ్రిటీష్‌ సైనికుడి తల కూడా నరికి, ఆ రెండు తలలను చేతబట్టి ఒక్క ఉదుటున గుర్రం ఎక్కేశాడు నరసింహారెడ్డి. పొలిమేరకు చేరగానే ఆయన్ను చూసిన సైనికులంతా విజయ నినాదాలు చేశారు. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించిన నరసింహారెడ్డి పేరు వాడవాడలా మారుమోగిపోయింది. ప్రకంపనలు మద్రాసులోకూడా వినిపించాయి.


వాట్సన్‌ చాప్టర్‌..!
తెల్లదొరల్లో భయం మొదలైంది. తమ పొగరుని అణిచే వీరుడి పుట్టుకను భరించలేకపోయారు. నరసింహారెడ్డిని చంపే పనిని వాట్సన్‌కి ఇచ్చారు. నరసింహారెడ్డిని అంతమొందించేందుకు బలమైన సైన్యాన్ని వెంటేస్కొని నొస్సం కోటపై దాడికి దిగాడు వాట్సన్‌. ∙వాట్సన్‌కి బలగముంటే, నరసింహారెడ్డి గుండెల్లో పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్నే సైన్యం గుండెల్లో నింపాడు. ‘తెల్లవాడికి భయపడే గుండె కాదురా ఇది!’ అంటూ విరుచుకుపడ్డాడు. వాట్సన్‌ బెంబేలెత్తి పారిపోసాగాడు. ‘ఈ నారసింహుడిపైకే దాడికొచ్చావ్‌! బతకగలననే పారిపోతున్నావా?’ అంటూ వెంటాడి వెంటాడి వాట్సన్‌ తల నరికాడు నరసింహారెడ్డి. కమ్ముకుంటున్న చీకట్లో నరసింహారెడ్డి పేరు కత్తి అంచులా వెలిగిపోయింది. బ్రిటీష్‌ ప్రభుత్వ పొగరును నరసింహారెడ్డి అనే రేనాటి పౌరుషం కమ్మేసిన చీకటది.

వెన్నుపోటు ప్లాన్‌..!
‘ఇంతటి మహా వీరుణ్ని ఏ సైన్యమూ ఏమీ చేయలేదు దొరా! వెన్నుపోటే’ ఓ బ్రిటీష్‌ అధికారి ముందు అన్నాడు మల్లారెడ్డి. ‘వెన్నుపోటు.. వెన్నుపోటు..’ మెల్లిగా తలాడిస్తూ, కోపంగా గొణిగాడు ఆ అధికారి. ‘అయితే ఆ మన్యంలోనే నరసింహారెడ్ది చావు!’ అంటూ పెద్దగా నవ్వాడా అధికారి, మల్లారెడ్డి చెప్పిన పథకం విని. వనదుర్గం అడవులనే ఆవాసంగా మార్చుకున్న నరసింహారెడ్డి అక్కడి వారికి దేవుడిగా అవతరించాడు. ఓ రోజు గిరిజన వాసుల విందు భోజనానికి హాజరయ్యాడు నరసింహారెడ్ది. తాను తింటుండగా భార్య సిద్ధమ్మ వచ్చి ‘నేను ముట్టకముందే మీరెలా తింటున్నారు’ అంటూ ఆ చెయ్యిని లాగేసుకుంది. ‘అమ్మ కంటే ముందు నేను ముట్టాలిది’ అంటూ ఓ సైనికుడు ఆ ముద్ద చేతపట్టాడు. కాసేపట్లో రక్తం కక్కి నేలపడిపోయాడు సైనికుడు. విష ప్రయోగం విఫలం కావడంతో.. ‘కోటలో, అడవిలో అతడి స్థావరం వద్దా నరసింహారెడ్డిని చంపలేం దొరా! నరసింహారెడ్డికి గిరిజనులంటే ప్రేమ. అక్కడి ఆడవాళ్ళంతా ‘అన్నా’ అంటూ కొలుస్తారు. వాళ్ళను చెరిచితే..’ మల్లారెడ్డి తన మాట పూర్తి చేయకముందే, పీటర్‌కు విషయం అర్థమైంది.

తెల్లకుక్క చచ్చింది..!
‘ఏమైనాదమ్మా?’ అడిగాడు నరసింహారెడ్డి.‘అడవిలో కట్టెలు కొట్టుకుంటా ఉంటే, బ్రిటీష్‌ దొరొచ్చి మీద చెయ్యేసి, చెరిచాడన్నా’ ఏడుస్తూ చెప్పిందామె.‘రేపు ఆ తలను ఇదే ఊర్లో తెగ నరికి తెల్లోడి కోటకు పంపించాలా!’ ఆవేశంతో రగిలిపోయాడు నరసింహారెడ్డి.అడవిలో తన స్థావరం నుంచి గిరిజన ఆవాసానికి ఒక్కడే వెళ్ళాడు. పీటర్‌ ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్నాడు. మల్లారెడ్డి కూడా నరసింహారెడ్డి ఎక్కడెక్కడికి వెళుతున్నాడన్నది గమనిస్తున్నాడు. తనని పట్టుకునేందుకొచ్చిన సైనికులందరినీ ఎక్కడికక్కడే నరికిపారేశాడు. పీటర్‌ మొదటిసారి చూస్తున్నాడు నరసింహారెడ్డిని, భయంతో వణికిపోయాడు. కళ్ళముందే శవాల్లా పడి ఉన్న సైనికులందరినీ విస్తుపోయి చూస్తూన్నాడు.

‘నరసింహారెడ్డి చేతిలో చావు ఇంత భయంకరంగా ఉంటుందా?’  అన్న విçషయం పీటర్‌కు అర్థమవుతోంది. నరసింహారెడ్డి పదగుడుల దూరంలో ఉండగానే, కింద శవంలా పడి ఉన్న తన సైనికుడి కత్తిని తీసుకొని తనని  తానే పొడుచుకున్నాడు పీటర్‌. ‘తెల్లకుక్క చచ్చిందన్నా!’ అందొక గిరిజన యువతి. పీటర్‌ శవాన్ని ఓ చెట్టుకి వేలాడదీసి, ‘వీడి చావు మన పౌరుషం. తెల్లోడి పొగరుకి మనమిచ్చిన సమాధానం ఈ వేళ్లాడుతున్న శవం’ అరుస్తూ చెప్పాడు నరసింహారెడ్డి.జనమంతా సంబరాలు చేసుకున్నారు.‘అన్నా! ఈ ఏకాదశినాడు జగన్నాథసామికి పూజ చేస్తున్నాం. నువ్వు రావాలన్నా’ నరసింహారెడ్డి చెయ్యి పట్టుకొని అడిగిందో యువతి.
నవ్వి, ‘వస్తాలే..!’ అన్నాడు నరసింహారెడ్డి. పరిగెత్తుకుంటూ వెళ్ళిందా యువతి.

ఫ్లాష్‌కట్‌...
జగన్నాథ ఆలయ ప్రాంగణం. తన తాత చెబుతోన్న కథంతా వింటూ వచ్చాడు పిల్లవాడు. ఆయుధమేదీ చేతపట్టకుండా, సైన్యం తోడేమీ లేకుండా ఒక్కడే ఆలయానికి వచ్చిన నరసింహారెడ్డి, కొలనులోనుంచి స్నానం చేసి అప్పుడే బయటకు వస్తున్నాడు.
పిల్లవాడు తాతను వదిలి పరిగెత్తుకుంటూ వచ్చి, నరసింహారెడ్డి కుడిచెయ్యిని అందుకొని ముద్దుపెట్టాడు. నరసింహారెడ్డి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఓ ముద్దిచ్చాడు.క్షణాల్లో కాక్రేన్‌ దొర సైన్యమంతా నరసింహారెడ్డిని చుట్టుముట్టింది. కాక్రేన్‌ దొర వెనకనుంచి వచ్చి పిల్లవాడిని చంపబోయాడు. నరసింహారెడ్డి ఆ కత్తిని లాగి ఇంకో బ్రిటీష్‌ సైనికుడి గుండెల్లో దించాడు. కాక్రేన్‌ దొర అదును చూసుకొని పిల్లవాడిని మళ్ళీ పొడవబోయాడు. ఆ కత్తికి అడ్డం పడి పిల్లవాడిని కాపాడాడు. పిల్లవాడిని కాపాడుతూ అప్పటికే నరసింహారెడ్డి ఎన్నో పోట్లకు గురయ్యాడు.
మరణానికి దగ్గరైనా కూడా ఏమాత్రం తగ్గనిపొగరుతో కాక్రేన్‌ దొర మీదకి ఓ సైనికుడి శవాన్ని విసిరేశాడు నరసింహారెడ్డి.

కొనఊపిరితో పిల్లవాడిని సైనికులకు దూరంగా తీసుకెళ్ళి, ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్ది పౌరుషం చావదు, చావలేదు. నువ్వే ఓ నరసింహారెడ్డివి’ అంటూండగా కాక్రేన్‌ దొర నరసింహారెడ్డిని మరలా మరలా పొడిచి, జుల్లేరు వాగుతీరం వద్ద ఉరితీశారు. ఆ తర్వాత అక్కడే నరసింహారెడ్డి తల నరికి, ఆ తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశాడు.తమకు ఎవ్వరూ ఎదురురావొద్దని, జనాల్లో భయం నింపాలన్న ఆలోచనతో అదే కోట గుమ్మానికి 30 ఏళ్ళ పాటు నరసింహారెడ్డి తలను అలాగే వేలాడదీసింది బ్రిటీష్‌ ప్రభుత్వం.అయితే అది తిరుగుబాటు చేసిన తల. తెల్లోడి పొగరును అణిచిన తల. రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తల. 30 ఏళ్ళు అలా కోట గుమ్మానికి వేలాడుతూ ఉన్న నరసింహారెడ్డి తల. అక్కడి వారిలో తిరుగుబాటును పెంచిందే కానీ వారిని భయపెట్టలేకపోయింది.కాక్రేన్‌ దొర నరసింహారెడ్డిని చంపిన రోజే ఆయన మీదకు ఓ రాయి విసిరాడు పిల్లవాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషం అప్పుడే మళ్ళీ పుట్టింది.

బ్రిటీష్‌ అధికారి మన్రోను ఎదిరించిన జయరామరెడ్డికి మనవడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అసలు పేరు మజ్జార నరసింహారెడ్డి. కాగా, ఉయ్యాలవాడ అన్న ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్నారు. 1805వ సంవత్సరంలో రూపనపూడిలో నరసింహారెడ్డి జన్మించారు. తండ్రి పెద్ద మల్లారెడ్డి.నరసింహారెడ్డి వంశం ఆధీనంలో ఉన్న నొస్సం కోటను వశపరచుకున్న బ్రిటీష్‌ ప్రభుత్వం, అందుకు తవర్జీ (భరణం) కింద ఆయనకు 1845వ సంవత్సరం వరకూ ఏడాదికి 11 రూపాయలు చెల్లిస్తూ వచ్చింది.నరసింహారెడ్డి చరిత్రను రెండేళ్ళకు పైగా శోధించి, ఆయన కథను రచయిత ఎస్‌.డి.వి.అజీజ్‌ ‘పాలెగాడు’ అనే నవలగా తీసుకొచ్చారు.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథను సినిమాగా తెరకెక్కించాలని గతంలో దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. తాజాగా నరసింహారెడ్డి జీవితకథతో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.
పాఠకులకు సూచన: రచయిత ఎస్‌.డి.వి.అజీజ్‌ రచించిన పాలెగాడు నవల ఆధారంగా చేసిన సినిమాటిక్‌ రూపకల్పన ఇది.

మరిన్ని వార్తలు