దీర్ఘ సుమంగళీభవ

27 Jul, 2016 00:09 IST|Sakshi
దీర్ఘ సుమంగళీభవ

కటాక్షించే తిరుపతమ్మ క్షేత్రం
కల్యాణ క్షేత్రాలు

 

పెళ్లిళ్ల సీజన్‌లో ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి  ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు  చేసుకుంటారు.  పెళ్లి కావాల్సిన వారు,  సంతానం లేనివారు  అమ్మ సన్నిధిలో  ముడుపులు  కడతారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఆమె. పెళ్లిళ్లు చేసుకునే కొత్త జంటలకు అమోఘ ఆశీస్సు ఆమె.


ఆ దేవత కొలువుండే క్షేత్రమే పెనుగంచిప్రోలు శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం. ఇది రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కృష్ణాజిల్లాలో శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయం తరువాత రెండవ స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో, జగ్గయ్యపేట, నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో ఉండి నిత్యం ఆంధ్రా నుండే కాకుండా తెలంగాణా రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకునే క్షేత్రంగా అలరారుతోంది.

 

ఆసక్తిదాయకం స్థల పురాణం
17వ శతాబ్దిలో పెనుగంచిప్రోలు సమీప గ్రామాల్లో సాక్షాత్తు శ్రీతిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వరప్రసాదినిగా జన్మించిన తిరుపతమ్మ బాల్యంలోనే సకల శాస్త్రపారంగమూర్తిగా పేరు గాంచింది. తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ, శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞానమార్గం బోధిస్తూ యుక్త వయస్సుకు వచ్చిన తిరుపతమ్మను పెనుగంచిప్రోలులోని సమీప బంధువులైన కాకాని వంశీయులు కృష్ణయ్య, వెంగమాంబల కుమారుడు గోపయ్యకు ఇచ్చి వివాహం చేశారు.

 
తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోటికోడలు చంద్రమ్మ అసూయ వల్ల అత్త వెంగమాంబ మనసు మారటంతో తిరుపతమ్మకు అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కరువు ఏర్పడటంతో గోవులకు మేత కోసం భర్త గోపయ్య తన జీతగాళ్లను తీసుకొని ఆవుల మందతో ఉత్తరారణ్యాలకు వెళ్లాడు. కాలమహిమ అన్నట్లుగా తిరుపతమ్మకు కుష్ఠువ్యాధి సోకింది. దాంతో అత్త, తోటికోడళ్లు పట్టించుకోకుండా పశువుల పాకలోకి నెట్టి వేశారు. ఆ సమయంలో ముదిరాజ్ వంశానికి చెందిన పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికీ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 
గోవుల మేత కోసం అడవులకు వెళ్లిన గోపయ్య పులి రూపంలో వచ్చిన పెద్దమ్మ తల్లితో పోరాడి వీరమరణం పొందారు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించిన తిరుపతమ్మ ప్రాయోపవేశానికి నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునసబు కర్ల ముత్యాలనాయుడు, కరణం శ్రీశైలపతి సమక్షంలోమహిమలు చూపి ప్రాయోపవేశం చేసింది.  యోగాగ్నిలో తనువు చాలించిన చోట కాలక్రమంలో తన ప్రతిమతో పాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికి ముందు ఆమె పతివ్రతా ధర్మాలను బోధించినట్లు చరిత్ర చెబుతోంది. తదుపరి పెద్దల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరగగా, నేడు కోట్లాది రూపాయలతో సుందర నిర్మాణం రూపు దాల్చింది. ఆలయం పక్కనే పవిత్రమైన మునేరు, మామిడి తోటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

 

సీజన్‌లో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు
పెళ్లిళ్ల సీజన్‌లో ప్రతిరోజూ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారికి ఆలయంలో నిత్య కల్యాణంతో పాటు ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. యోగాగ్నిలో ప్రవేశించిన తరువాత చితిమంటల నుంచి తన భర్త ప్రతిమ తన ప్రతిమతో పాటు పసుపు-కుంకుమలు వస్తాయని, ఆరోజు నుంచి తనను కొలిచిన వారికి నిత్య సుమంగళితనం, సంతానం, సిరిసంపదలు అనుగ్రహమవుతాయని తిరుపతమ్మ చెప్పింది. అందుకు తగినట్టుగా ప్రధాన ఆలయంలోని అమ్మవారి విగ్రహం చేతిలో కుంకుమ భరిణ ఉంటుంది. అందుకే ఆమె సమక్షంలో కల్యాణం చేసుకుంటే మంచిదని భక్తుల విశ్వసిస్తున్నారు. అలాగే పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేనివారు అమ్మ సన్నిధిలో ముడుపులు కడతారు.

 

ఏటా ఉత్సవాలు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 34 కులాల వారికి సంబంధించిన క్రతువులతో, యజ్ఞయాగాదులతో అలరాలుతున్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నుండి ఐదు రోజుల పాటు, చిన్న తిరునాళ్లు ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. వీటితో పాటు ప్రతి రెండేళ్లకు ఒకసారి రంగుల ఉత్సవం వైభవంగా జరుగుతుంది.
- పులికొండ సాంబశివరావు
సాక్షి ప్రతినిధి, పెనుగంచిప్రోలు

 

వసతి సదుపాయాలు
శ్రీతిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులకు శ్రీతిరుపతమ్మ సదన్, శ్రీగోపయ్య సదన్ పేరుతో సత్రాల గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ, నాన్ ఏసీ గదులు కలిపి మొత్తం 100 వరకు ఉన్నాయి. అలాగే ప్రైవేటు గదులు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయి.

 

ఎలా చేరుకోవాలి
విజయవాడ నుండి; జగ్గయ్యపేట, నందిగామ నుండి ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అలాగే ట్రావెల్స్ బస్సులు, కారులు, ఆటోలు సిద్ధంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు