కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమా?

10 Oct, 2013 20:09 IST|Sakshi
కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమా?

'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎన్ని ఎంపీ సీట్లు గెలిపించగలరు? తెలంగాణ ఇస్తే వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం పొందవచ్చు'.. తెలంగాణను వ్యతిరేకించిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నుంచి ఎన్నోసార్లు ఎదురైన ప్రశ్న ఇది. దిగ్విజయ్, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వారికి రాష్ట్రం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న విషయం అందరికీ అర్థమవుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం.. పనిలోపనిగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడం. ఈ రెండే కాంగ్రెస్ లక్ష్యాలు. అంటే ఓట్లు సీట్లు కోసం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సిద్ధమైంది కానీ తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాదన్న మాట.

తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయో.. టీఆర్ఎస్ విలీనమవుతుందో లేదో.. ఈ ప్రాంతంలో ఏ మేరకు లబ్ధి పొందుతుందో గానీ సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి 'ఎవరు తీసుకున్న గోతిలో వారే..' అన్నట్టుగా తయారైంది. కాంగ్రెస్పైనా, ఆ పార్టీ నాయకులపైనా రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముఖ్యమంత్రి సహా ఎవరూ గెలవరని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. ఆరేడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచినవారు సైతం కాంగ్రెస్ తరఫున నిలబడితే డిపాజిట్లు కూడా రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు క్యూ కడుతుంటే మరికొందరు టీడీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెస్ అవలంబిస్తున్న వైఖరి సరికాదన్నవాదనతో ఇరు ప్రాంతాల్లోని చాలామంది మేధావులు ఏకీభవిస్తారు. సీమాంధ్రుల ఆందోళనల్ని పట్టించుకోకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపకుండా, నిర్దిష్టమైన హామీలు ఇవ్వకుండా కాంగ్రెస్ ఏకపక్ష ధోరణి అవలంబించడం దారుణం. టీడీపీ కూడా రెండు కళ్ల సిద్ధాంతంతో స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా కాంగ్రెస్ ఊబిలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం, సీపీఎం స్పష్టమైన వైఖరి తెలియజేశాయి. వచ్చే ఎన్నికల తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడు, పశ్చిమబెంగాల్ తరహాలో తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు