బాబు, రాజన్నపాలనలో... మహిళల రుణాలు

4 May, 2014 01:19 IST|Sakshi
బాబు, రాజన్నపాలనలో... మహిళల రుణాలు

మహిళా పక్షపాతిగా వ్యవహరించిన వైఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిని అన్ని విధాల ప్రోత్సహించారు.బాబు హయాంలో మహిళలు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ మైక్రో ఫైనాన్స్ కంపెనీల మెట్లెక్కి దిగుతూ నానా ఇబ్బంది పడేవారు. అప్పు వచ్చే వరకు ఒక బాధ అయితే రుణం తీర్చే విషయంలో చాలా అవమానాలకు గురయ్యేవారు. బకాయిల వసూలుకు కంపెనీలు రౌడీలను పురమాయించేవి. వారు చేసే యాగీని భరించలేక అవమానాలను తట్టుకోలేక చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో  సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ మహిళలకు అన్నగా, అందగా, పెద్ద కొడుకుగా నిలిచారు. జీవితంపై భరోసా కల్పించారు. మహిళలకు వడ్డీ రేట్లను ఒకవైపు తగ్గిస్తూ ప్రైవేటు మైక్రోఫైనాన్స్ సంస్థలపై మరోవైపు నియంత్రణ పెంచారు. చివరికి పావలావడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోయే విధానాన్ని అమలుచేశారు. వైఎస్ హయాంలో మహిళా సంఘాలు సమర్థంగా పనిచేస్తూ కుటుంబాల జీవనప్రమాణాలను మార్చేశాయి.
 
 బాబు పాలన

 ‘‘మహిళా ఓట్లతోనే అధికారంలోకి వచ్చాం.. వారంతా మా పక్షమే’’... అప్పట్లో చంద్రబాబు పదేపదే చెప్పిన మాటలివి. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తమకు ఏం జరిగిందని ఏ స్త్రీమూర్తిని అడిగినా ఆ నాటి ఘటనలు తలచుకుని మండిపోతుంది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలను హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సాక్షిగా గుర్రాలతో తొక్కించిన వైనం... చంకలో పసిపిల్లలతో ఆందోళన చేస్తున్నా పోలీసులతో తరిమితరిమి కొట్టించిన పాశవిక సన్నివేశాలు... గుక్కెడు నీటి కోసం జన్మభూమిలో నిలదీస్తే తెలుగుసేన రూపంలో దండెత్తిన వైనాలు... తండా మహిళలపై ‘దేశం’ తమ్ముళ్లు జరిపిన దారుణాలు... విద్యుత్ చార్జీలు భారమంటే లాఠీలు ఝళిపించిన దృశ్యాలు... ఇలా ఎన్నెన్నో
 
రాజన్న రాజ్యం
 
 వైఎస్ సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో 5 లక్షల మహిళా సంఘాలుంటే, ఆయన  హయాంలో ఏకంగా 4.5 లక్షలకు పైగా కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సంఘాలకు లభించే బ్యాంకు రుణంగా ఎప్పుడూ గరిష్ఠంగా రూ.25 వేలకు మించలేదు. కానీ వైఎస్ మరణించే నాటికి ప్రతి గ్రూపుకూ సగటున లభించిన బ్యాంకు రుణం ఏకంగా రూ.1.6 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 8 రెట్లు! ఇక బాబు హయాంలో లభించిన బ్యాంకు రుణాలు రూ.1,898 కోట్లు మాత్రమే ఉంటే వైఎస్ మరణించే నాటికి అవి ఏకంగా రూ.27,000 కోట్లకు చేరాయి. పావలా వడ్డీ పథకం కింద వైఎస్ తన హయాంలో దాదాపు రూ.500 కోట్లు పావలా వడ్డీ కోసం మహిళలకు రీయింబర్స్ చేశారు.
 
 పండుటాకులకు ఆసరా...
 
 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలకు ఆసరాగా నిలిచేందుకు, వారు కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు వైఎస్ ప్రారంభించిన బీమా తరహా పథకం అభయహస్తం. 18-59 ఏళ్ల మధ్య వయసు మహిళలంతా ఇందులో చేరడానికి అర్హులు. వారు రోజుకు ఒక రూపాయి పొదుపు చేస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. 60 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,250 దాకా పించన్ వస్తుంది. కొద్ది నెలల్లోనే దాదాపు 45 లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. 4.5 లక్షల మంది వృద్ధులకు ప్రతి నెలా రూ.500 పెన్షన్ మంజూరైంది.
 
మహిళల కోసం ఎంత డబ్బు
 
ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళతన భర్తతో సమానంగా సంపాదించగలిగినప్పుడే ఆమెకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసేవరకు నిద్రపోను.నేను కలలుగన్న మరో ప్రపంచానికిమహిళలే మూలస్తంభాలు.
 
 - దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి
 
 

మరిన్ని వార్తలు