ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!

12 Nov, 2023 14:56 IST|Sakshi

సాధారణంగా పిల్లలు.. రేపటి కలలను కంటూ పెరుగుతారు. కానీ కొందరు పిల్లలు మాత్రం తమలోని కళలను బయపెడుతూ నేడే ఆ కలలను నిజం చేసుకుంటున్నారు. లక్ష్యాలు, విజయాలతో మతాబుల్లా వెలిగిపోతున్న ఆ చిచ్చరపిడుగులను పరిచయం చేసుకుందాం.. వాళ్లు సాధించిన ఘనతలేంటో తెలుసుకుందాం.. 

లిసిప్రియ కంగుజంమణిపూర్, బషిఖోంగ్‌ గ్రామంలో.. 2011లో పుట్టిన లిసిప్రియ.. ప్రపంచంలోనే అతి పిన్న పర్యావరణవేత్తల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన ఐదేళ్ల వయసు నుంచే గ్లోబల్‌ వార్మింగ్, నిరక్షరాస్యత వంటి సమస్యలపై గొంతెత్తింది. 2019లో స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి ‘వాతావరణ మార్పు సదస్సు’లో ప్రపంచ నాయకులతో మాట్లాడి మెప్పించింది.

లిడియన్‌ నాదస్వరం
తమిళ సంగీత దర్శకుడు వర్షన్‌ సతీష్‌ రెండో కుమారుడే ఈ లిడియన్‌ నాదస్వరం. సంగీతకారుడిగా, పియానిస్ట్‌గా, కీబోర్డ్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న లిడియన్‌.. తన రెండేళ్ల వయసు నుంచి డ్రమ్స్‌ వాయించడం మొదలుపెట్టాడు. 8 సంవత్సరాల వయస్సులో పియానో నేర్చుకున్నాడు. 2019లో తన 14వ ఏట.. అమెరికన్‌ టెలివిజన్‌ íసీబీఎస్‌ నిర్వహించిన టాలెంట్‌ షోలో రెండు పియానోలను ఒకేసారి అద్భుతంగా వాయించాడు. దానిలో విజేతగా నిలిచి.. 1 మిలియన్‌ ఫ్రైజ్‌ మనీ సాధించాడు.

మొన్నటికి మొన్న కడప వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన 6 నెలల బాబు ప్రజ్వల్‌.. పలు జంతువులు, పండ్లు, వాహనాలు, నంబర్లు ఇలా చాలావాటిని గుర్తుపట్టి.. ఆశ్చర్యపరిచాడు. తన గ్రాహక శక్తితో ‘నోబుల్‌ వరల్డ్‌ రికార్డ్‌’ సాధించాడు. అలాగే హైదరాబాద్, మల్కాజిగిరికి చెందిన 8 నెలల పాప ఆద్యశ్రీ.. తన గ్రాహక శక్తితో నోబుల్‌æవరల్డ్‌ రికార్డ్‌లో తన పేరు నమోదు చేసుకుంది. సుమారు 300 ఫొటోలను, వస్తువులను గుర్తించగల ఆధ్య.. 30 దేశాల జాతీయ జెండాలను గుర్తించి ఈ రికార్డ్‌ సాధించింది. ఇలా ఎందరో పిల్లలు వయసుకు మించిన విజయాలతో దూసుకుపోతున్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు.

తనిష్క భూపతిరాజు
ఆంధ్రప్రదేశ్, భీమవరానికి చెందిన తనిష్క.. తన ఆరేళ్ల వయసులోనే విల్లును ఎక్కుపెట్టి.. ఆసియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు సంపాదించింది. 16 నిమిషాల 50 సెకన్ల వ్యవధిలో 100 బాణాలను 40 సెంటీమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకేలా ఆర్చరీలో అద్భుతమైన ప్రతిభను చాటుకుంది. 

హర్పిత పాండియన్‌
వీరు చెన్నైకి చెందిన కవలలు. చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా ఎదిగి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరు ‘స్పెల్లింగ్‌ బీ ట్విన్స్‌ ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్‌మైండ్స్‌ అనే ఉఛీఖ్ఛీఛిజి కంపెనీని స్థాపించి.. ఎందరో విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది ఆన్‌ లైన్‌ మౌఖిక స్పెల్లింగ్‌ బీ పోటీ. విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, వారి స్పెల్లింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి తర్ఫీదునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఈ ట్విన్స్‌.. తాము చేసిన విశేషకృషికి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 10కి పైగా దేశాల నుంచి వేల మంది విద్యార్థులు ఇందులో రిజిస్టర్‌ అవుతుంటారు. విజేతలుగా నిలుస్తుంటారు.

అద్వైత్‌ కోలార్కర్‌
పుణేకి చెందిన అద్వైత్‌.. 8 నెలల వయసులోనే పెయింటింగ్స్‌ వేయడం మొదలుపెట్టాడు. రెండేళ్లకే పుణేలోని ఆర్ట్‌2డే గ్యాలరీలో తన మొదటి సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించాడు. ఇటీవల తను వేసిన ఒక పెయింటింగ్‌ 16,800 డాలర్లకు అమ్ముడు పోయింది. ఇప్పటి వరకూ అతడు వేసిన పెయింటింగ్స్‌ అన్నీ కలిపి.. 3,00,000 డాలర్లకు మించి అమ్ముడుపోయాయి. ఇప్పటికే 19కి పైగా సోలో ప్రదర్శనలు ఇచ్చి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. 

(చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్‌ చానెల్‌! వాళ్లే రిపోర్టింగ్‌, యాంకరింగ్‌..)

మరిన్ని వార్తలు