నేనూ  మరచిపోతానా?

19 Aug, 2018 01:12 IST|Sakshi

సందేహం

నా ఫ్రెండ్‌ ఒకరికి మంచి జ్ఞాపకశక్తి ఉండేది. అలాంటి వ్యక్తి ప్రెగ్నెన్సీ తరువాత చిన్న చిన్న విషయాలను సైతం మరిచిపోతోంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నాకు కూడా మా ఫ్రెండ్‌లాగే అవుతుందా? గర్భిణి స్త్రీలకు డెమన్షియ రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు. – పి.సుమ, సికింద్రాబాద్‌
గర్భం దాల్చిన తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసిక మార్పులు, హార్మోన్స్‌లో మార్పులు కూడా దానికి తోడవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వారిలో ప్రెగ్నెన్సీకి సంబంధించి ఆలోచనలు, సందేహాలు, పని ఒత్తిడి, తమ జీవితంలోకి కొత్తగా వచ్చే బిడ్డ గురించిన ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఈ మార్పుల వల్ల కొందరిలో ఏకాగ్రత కోల్పోవటం, కొద్దిగా మతిమరుపు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనినే డెమన్షియ అంటారు. ఇది అందరి గర్భవతులలోను ఉండాలని లేదు. అది ఒక్కొక్కరి జీవనశైలిని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి కొందరిలో ఉండవచ్చు. ముఖ్యంగా గర్భం దాల్చిన  వారికి కుటుంబ సభ్యుల అండ చాలా అవసరం. వారిచ్చే ధైర్యం, తోడ్పాటు వల్లనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే, ఈ సమయంలో జరిగే మార్పులు, ఇబ్బందులకు వీరు ఆందోళన చెందకుండా సంతోషంగా ఉండగలుగుతారు. దానివల్ల డెమన్షియ లక్షణాలు పెద్దగా ఉండవు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొద్దిగా వాకింగ్, ధ్యానం, ప్రాణాయామం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది.

నేను చేపలు తింటానుగానీ, మరీ ఎక్కువగా తినను. అయితే... ఎర్లీ స్టేజీలో తగినంత పరిమాణంలో చేపలను ఆహారంగా తీసుకోకపోవడం వల్ల నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? చేపల్లో కూడా రసాయనాలు వాడుతున్నారనే వార్తలు చదివాక...తినాలంటే భయమేస్తోంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? – ఆర్‌.నీరజ, జంగారెడ్డిగూడెం
చేపలు తినకపోవటం వల్ల నెలలు నిండకుండా డెలివరీలు అవుతాయని ఎక్కడా లేదు. నెలలు నిండకుండా పుట్టడానికి గర్భాశయంలో సమస్యలు, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్స్, బీపీ, సుగర్‌ వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. కాకపోతే చేపలలో ఈఏఅ, ఉ్కఅ∙అనే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. అలాగే కొద్దిగా ప్రొటీన్స్, విటమిన్‌ డి ఉంటాయి. ఈ ఒమేగ ఫ్యాటీ యాసిడ్స్‌ మిగతా ఆహారంలో పెద్దగా లభించదు. ఇవి బిడ్డ మెదడు, కళ్లు ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అలా అని బాగా ఎక్కువగా చేపలు తినాలని ఏం లేదు. వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు. కొన్ని పరిశోధనలలో చేపలు తినటం వల్ల కొందరిలో నెలలు నిండకుండా జరిగే కాన్పులను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. అలాగే పిల్లల బరువు కూడా మరీ తక్కువగా లేకుండా ఉంటారని అంచనా వేయడం జరిగింది. చేపలు నీటిలో ఉండే మెర్క్యురీని పీల్చుకుంటాయి. కొన్నింటిలో ఇది తక్కువగా, మరికొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. అది ఆ నీటిలో విడుదలయ్యే పదార్థాలు, విషవాయువులను బట్టి ఉంటుంది. సముద్రపు చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. బయట మంచినీటిలో పెంచే చేపలలో పెద్దగా మెర్క్యురీఉండదు. కొద్దిగా మెర్క్యురీ ఉండటం వల్ల బిడ్డకు ఇబ్బంది ఉండదు. మెర్కురి అధిక శాతం ఉన్న చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, బిడ్డలో నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రోజుకొకటి చొప్పున తీసుకోవచ్చు.

బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా  చెబుతున్నారు. బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? అనేదాని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.రూప, పార్వతీపురం
గర్భంతో ఉన్నప్పటి కంటే కాన్పు తరవాత బాలింతకు ఆహారం ఎక్కువ అవసరం. గర్భంతో ఉన్నప్పుడు, తల్లి కడుపులో పెరిగే బిడ్డకు మామూలుగా కంటే ఆహారంలో 300 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. అదే బాలింతకు 600 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. ఈ కేలరీల బలం, తల్లిలో తొమ్మిది నెలల తర్వాత వచ్చిన శరీర మార్పులను, బలహీనతల నుండి తేరుకోవడానికి అలాగే తల్లి పాల ద్వారా బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరం. ఇది తల్లి తీసుకునే పౌష్టికాహారం ద్వారా లభిస్తుంది. మన దేశంలో బాలింత అది తినకూడదు, ఇది తినకూడదు, వాటి వల్ల చీము పడుతుంది, పప్పు తింటే కుట్లు మానవు, నీళ్లు ఎక్కువగా తాగితే పొట్ట వస్తుంది, పెరుగు, పండ్లు తింటే బిడ్డకు జలుబు చేసే అవకాశం ఉంటుంది అనే ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలతో చాలా మంది పెద్దవాళ్లు.. బాలింతకు ఆహారం సరిగా ఇవ్వకుండా కారంపొడులు వంటి వాటితో సరిపెడుతుంటారు. నిజానికి ఇది ఎంత మాత్రం సరికాదు. ఆహారంలో అన్నం, పప్పులు, అన్ని రకాల కూరగాయలు, మాంసాహారులైతే మాంసం తీసుకోవడం వల్ల, వాటిలో ఉండే కార్బోహైడ్రేౖట్స్, ప్రొటీన్స్‌ కుట్లను తొందరగా మానిపోయేటట్లు చేస్తాయి. తల్లిలో అలసటను దూరం చేస్తుంది. బిడ్డకు సరిపడా పాలు పడతాయి. నీళ్లు బాగా తాగడం వల్ల యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ లేకుండా ఉంటుంది. మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గుతుంది. పాలు బాగా వస్తాయి. బిడ్డ తల్లి పాలు తాగడం వల్ల, తల్లిలోని పోషకాలు తీసేసుకోవడం వల్ల తల్లి బలహీనంగా తయారవుతుంది. అందుకే బాలింతల ఆహారంలో తప్పనిసరిగా రెండు గ్లాసుల పాలు, రెండు లీటర్ల నీళ్లు, అన్నం, చపాతీ, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లతో పాటూ పెరుగు, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు లేదా మెంతికూర వంటివి తీసుకోవడం వల్ల పాలు బాగా పడతాయి. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో నూనె, కారం, మసాలా వంటివి తగ్గించుకోవాలి. జంక్‌ ఫుడ్‌ వంటివి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో ,హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు