నివృత్తం: అక్షింతలు ఎందుకు చల్లుతారు?

14 Jun, 2014 23:59 IST|Sakshi
నివృత్తం: అక్షింతలు ఎందుకు చల్లుతారు?

అక్షతలు అన్నమాట నుంచి అక్షింతలు వచ్చింది. అక్షతలు అంటే... రోకటిపోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం.  నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి దానవస్తువు బియ్యం.
 
 మనిషి మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనసుపై ప్రభావం చూపుతుందట. చల్లేవారి శరీరంలోని విద్యుత్‌ను, ఆశీస్సులు పుచ్చుకునేవారి శరీరంలోకి సరఫరా చేస్తాయి అక్షతలు. తద్వారా తమో, రజో, సాత్వికాలనే త్రిగుణాలకు కారకాలు అవుతాయి. కాబట్టి పెద్దల్లో ఉండే సాత్విక గుణం అక్షింతల ద్వారా పిల్లలకు చేరుతుందనే ఉద్దేశంతోనే శుభకార్యాల్లో వాటిని చల్లే సంప్రదాయం పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి.
 
కుప్ప తగులబెట్టి పేలాలు ఏరుకు తిన్నట్టు... 
ఒక ఊళ్లో ఒక పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు వాళ్లమ్మ దగ్గరకు వెళ్లి పేలాలు తినాలని ఉందన్నాడు. పనిలో ఉన్న తల్లి... తర్వాత చేసి పెడతానులే అంది. తనకు ఇప్పుడే కావాలని మారాం మొదలుపెట్టడంతో వీపు మీద ఒక్కటిచ్చింది. దాంతో పౌరుషం వచ్చేసింది పిల్లగాడికి. ఎలాగైనా పేలాలు తిని తీరాలనుకున్నాడు. పేలాలను ఒడ్ల నుంచి చేస్తారని తెలుసు కాబట్టి వెళ్లి వరికుప్పకు నిప్పెట్టాడు. ఏడాదికి సరిపడా ధాన్యం తగులబడిపోతున్నా పట్టించుకోకుండా, టపటపా పేలుతున్న పేలాలను ఏరుకుని తింటూ కూచున్న అతణ్ని చూసి తల్లి నెత్తీ నోరూ బాదుకుందట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోనికి వచ్చింది. చిన్న ప్రయోజనం కోసం పెద్ద నష్టం చేసినవారి విషయంలో దీన్ని వాడతారు!

మరిన్ని వార్తలు