ఆర్టీసీకి నిధులపై నిలదీసిన రేవంత్‌రెడ్డి

2 Nov, 2019 18:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శనివారం నగరంలో జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్‌ వాడివేడిగా జరిగింది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, ఎమ్మెస్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా చెత్త, చెదారంతో నిండిఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు తీవ్ర జ్వరాలు వస్తున్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు.

డల్లాస్‌ లేదు, ఇస్తాంబుల్‌ లేదు. ఆటో నగర్‌ డంపింగ్‌ యార్డుతో జనాలు రోగాల బారిన పడుతున్నారని స్థానిక కార్పొరేటర్‌ నిలదీశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆర్థిక అంశాలలో జీహెచ్‌ఎంసీ పాత్ర పరోక్షంగా ఉందని విమర్శించారు. ఆర్టీసీకి సంవత్సరం వారీగా ఎంత మొత్తంలో నిధులు విడుదల చేశారు? ఇంకా ఎన్ని ఇవ్వాలి? జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి నిధులు ఇవ్వాలని నిబంధన ఉందా? లేక దయాదాక్షిణ్యాల మీద ఇవ్వాలా? అనే విషయాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కూకట్‌పల్లి ప్రాంతంలో మురికివాడలు పల్లెటూర్ల కంటే దారుణంగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. 

మరిన్ని వార్తలు