పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు

15 May, 2016 02:17 IST|Sakshi
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు

ఈ నెల 20 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన

 సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2016 కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సాంకేతిక విద్యా మండలి అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న ఈ కౌన్సెలింగ్‌లో పాలిసెట్ ర్యాంకుల వారీగా అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక హెల్ప్‌లైన్ కేంద్రం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు.

అభ్యర్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు అదనపు హెల్ప్‌లైన్ కేంద్రాలను కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, వనపర్తిలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్, నాగార్జున డిగ్రీ కళాశాల, ఖమ్మం జిల్లాలో ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం (రుద్రంపూర్) ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్, నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, మెదక్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, రాజగోపాల్‌పేట (సిద్దిపేట) ప్రభుత్వ పాలిటెక్నిక్, కరీంనగర్‌లోని బీఆర్‌ఏజీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్ లో జేఎన్‌టీయూ, సాంకేతిక విద్యాభవన్, మారేడుపల్లిలోని ప్రభుత్వ ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, పాతబస్తీలోని కులీకుతుబ్‌షా ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

మరిన్ని వార్తలు