ఐటీ పిటీ

24 Oct, 2013 03:25 IST|Sakshi
ఐటీ పిటీ

=‘అభయ’ ఘటనతో ఉలిక్కిపడిన ఐటీరంగం
 =మహిళా ఉద్యోగుల్లో అభద్రత
 =ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడం శాపం
 =భద్రత లేని ఆటోలు, క్యాబ్‌లు
 =అరకొరగా సీసీ కెమెరాలు
 =నైట్‌విజన్ కెమెరాలకు దిక్కులేదు
 =అడుగడుగునా భద్రత డొల్ల

 
సాక్షి, హైదరాబాద్/సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఐటీ కారిడార్.. చూడ్డానికి అందంగా, అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో ఐటీ ఉద్యోగులు మాత్రం ఆ కారిడార్‌లో అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. ప్రత్యేకించి అమ్మాయిల భద్రత గాలిలో దీపంలా మారింది. ఒక నిఘా, నియంత్రణ లేని పాలకుల నిర్వాకం కొందరి జీవితాల్ని చిదిమేస్తోంది. ఐటీ కారిడార్‌లో నేరగాళ్ల స్వైరవిహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ‘అభయ’ ఉదంతమే నిదర్శనం. ఇందుకు ఎన్నెన్నో కారణాలు.. నిర్లక్ష్యం కొంత.. ఆదమరుపు మరికొంత.. ఏదైనా ఘటన జరిగినపుడు హడావుడి.. ఆపై మిన్నకుండిపోవడం.. ఫలితంగా హైటెక్ సిటీలో పనిచేసే అమ్మాయిలకు భద్రత కరువైంది. కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఇక్కడ లోపించింది. రాత్రి 8 దాటితే సిటీ బస్సు జాడ ఉండదు. గత్యంతరం లేక ప్రైవేట్  వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నేరాలకు, ఘోరాలకు దారితీస్తోంది.
 
సగర్వంగా తలెత్తుకున్నా..

ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్ర ఐటీ రంగం నిలదొక్కుకుంది. దేశంలో నాలుగో స్థానంలో నిలిచి సగర్వంగా తలెత్తుకుంది. కానీ అదే ఐటీ కారిడార్‌లో పనిచేసే ఓ అమ్మాయి మృగాళ్ల చేతిలో దగాపడిందని తెలిసి మొత్తం సభ్య సమాజం నివ్వెరపోయింది. మహిళా ఉద్యోగులు అభద్రతకు గురయ్యారు. రాష్ట్రం మొత్తం మీద 3,27,000 మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ ఐటీ ఉద్యోగుల్లో వీరి సంఖ్య 11.4 శాతం. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ రంగంలో 3 లక్షల వరకు ఉద్యోగులున్నారు. వీరిలో 30- 40 శాతం మంది మహిళా ఉద్యోగులున్నట్టు అంచనా. దశలవారీగా ఐటీ రంగం విస్తరి స్తుంటే.. అందులోని ఉద్యోగులకు కష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు ప్రజారవా ణావ్యవస్థ విస్తరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఉద్యోగులు అవస్థల పాలవుతున్నారు.

 ప్రధాన లోపం అదే..

 సైబారాబాద్ దాదాపు 52 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఐటీ సంస్థలన్నీ సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ) పరిధిలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 3 లక్షల సాధారణ జనా భా నివాసం ఉంటోంది. వీరితోపాటు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు ప్రధానంగా మాదాపూర్‌లోని సైబర్‌టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్, ఆర్‌ఎంజడ్ ఫ్యూచురా, టీసీఎస్ డెక్కన్‌పార్క్, డెల్, కన్వర్జిస్, వానెన్‌బర్గ్ ఐటీపార్క్, ఐల్యాబ్స్ క్యాంపస్‌లలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు.

కొండాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవ ర్, సత్యం సైబర్‌స్పేస్, సత్యం ఇన్ఫోసిటీ, టీసీఎస్ పార్క్, ఎస్‌ఎంఆర్ టెక్నాలజీస్ తదితర క్యాంపస్‌ల్లోనూ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇవి తొలివిడత విస్తరణలో వచ్చిన సంస్థలు. మలిదశలో గచ్చిబౌలిలో ఐఎస్‌బీ, ఇన్ఫోసిస్, డీఎల్‌ఎఫ్ సిటీ, ఎస్డీఈ ప్రమేలా తదితర క్యాంపస్‌లు వచ్చా యి. మణికొండలో మైక్రోసాఫ్ట్, పోలారిస్, విప్రో, కాన్‌బే, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, యూబీఎస్, సీఏ, సియరా అట్లాంటిక్, వట్టినాగులపల్లిలో సత్యం క్యాంపస్.. ఇలా వరుసగా కొత్తవి వచ్చాయి. ప్రస్తు తం తెల్లాపూర్, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లోనూ ఐటీ సెజ్‌లు నెలకొంటున్నాయి.

ఐ టీ కారిడార్‌లో నివాస ప్రాంతాలు ఖరీదైనవి కావడంతో ఇక్కడికి దూరంగా ఉండి విధులకు హాజరవుతున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. బస్సులు లేదా ప్రైవేటు వాహనాలే వీరికి దిక్కు. తొలిదశలో ఏర్పాటైన ఐటీ క్యాంపస్‌లకే పూర్తిస్థాయిలో ప్రజారవాణా వ్యవస్థ లేదు. పట్టుమని నాలుగు కి.మీ.దూరంలేని జేఎన్టీయూహెచ్ క్యాంపస్ వరకు కూ డా ఆర్టీసీ బస్సులు నడవవు. ఐటీ ఉద్యోగులంతా ప్రగతినగర్, మియాపూర్, నిజాంపేట, హైదర్‌నగర్‌లో ఎక్కువగా నివసిస్తున్నారు.

ఈ మార్గాల్లో బస్సులే లేవన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఇక అల్వాల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఎక్కాల్సిందే. బోయిన్‌పల్లి, మేడ్చల్, అల్వాల్, జేబీఎస్, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లేవు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల, బీహెచ్‌ఈల్ తదితర ప్రాంతాలను ఐటీ కారిడార్‌కు కలుపుతూ రవాణా వ్యవస్థ లేదు. ఉప్పల్, సికింద్రాబాద్, కోటి.. ఈ మూడు మార్గాల్లోనే బస్సులు నడుస్తున్నాయి. ఇక రాత్రి వేళ అయితే జాడే ఉండవు.  
 
ప్రైవేటే శరణ్యం..

 గతంలో షేరింగ్ ఆటోలో ఓ ఐటీ ఉద్యోగినిపై దాడి జరిగినప్పుడు వివిధ శాఖలు కొంత హడావుడి చేసినా ప్రజా రవాణా వ్యవస్థను మాత్రం మెరుగుపరచలేదు. అప్పట్లో మహిళా ఉద్యోగినుల రక్షణకు ఐటీ, పోలీస్ విభాగాలు కొంత సమన్వయంతో పనిచేసినా.. ఆపై మిన్నకుండిపోయాయి. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే నివారణ చర్యలపై దృష్టిపెడితే మేలని ఐటీ ఉద్యోగులు అంటున్నారు.

 అధికారులతో మాట్లాడాం: మంత్రి లక్ష్మయ్య

 ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఇతర సమస్యలపై ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను వివరణ కోరగా.. ‘ఐటీ ఉద్యోగినిపై జరిగిన లైంగికదాడి ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలపై ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా అది దురదృష్టకరమై నదే. గత ఏడాది నుంచే భద్రత విషయంలో ఐటీ ఉద్యోగులకు పలు దఫాలుగా అవగాహన కల్పించాం. ఐటీ సంస్థల మహిళా ఉద్యోగులకు కచ్చితంగా క్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఇదివరకు సూచించాం. ఇకపై కూడా సూచిస్తాం. ఐటీ కారిడార్‌లో మౌలిక వసతులపై మరోసారి సమీక్షించి చర్యలు తీసుకుంటాం’ అన్నారు.
 
 ఈ ప్రాంతంలో క్యాబ్‌లే గతి..


 ‘ఈ ప్రాంతంలో షేరింగ్ ఆటోలు, ప్రైవేటు క్యాబ్‌లే గతి. ఒక్కరే ఆటో ఎక్కాలంటే చిన్నచిన్న రూట్లలోనే రూ. 150 వరకు అడుగుతున్నారు. ప్రధాన రూట్లలోనే బస్సుల్లేవు. సైబర్ టవర్స్ వరకు ఉన్నా.. మలిదశలో విస్తరించిన ఐటీ క్యాంపస్‌ల వరకు బస్సులు లేవు. రాత్రివేళ అసలే లేవు..’
 - నరేంద్రకుమార్,  ఐటీ రిక్రూటింగ్ సంస్థ
 
 మినీ బస్సులైనా...


 ‘ఐటీ సంస్థలు ఉన్న ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ చాలా ఎక్కువుంది. అమ్మాయిలు బైక్‌పై వెళుతుంటేనే పక్క నుంచి అరుపులు, కామెంట్లు వినిపిస్తుంటాయి. కనీసం మినీ బస్సులైనా నడిపిస్తే అమ్మాయిలకు భరోసా ఉంటుంది. అన్ని సంస్థల్లో క్యాబ్ వ్యవస్థ లేదు. విభిన్న షిఫ్టుల్లో పనిచేయాలి. రాత్రివేళలో రహేజా నుంచి గచ్చిబౌలి మార్గంలో కనీసం విద్యుత్తు దీపాలు కూడా వెలగవు. నిరంతరం బస్సు సౌకర్యం, పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలి’  - స్రవంతి, ఐటీ ప్రోగ్రామర్
 

మరిన్ని వార్తలు