వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

1 Jan, 2017 03:42 IST|Sakshi
వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

- మంత్రి పోచారం వెల్లడి
- వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ
- రైతులకు నిరంతర విద్యుత్‌: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌: వ్యవసాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని రెడ్డిహాస్టల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా హాజరై న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్‌ను, వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి టెలిఫోన్‌ డైరీని, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్‌ టేబుల్‌ క్యాలెండర్‌లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ... గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయరంగ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాట య్యాక సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్ని అవాంత రాలను అధిగమించి పురోగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులు రుణాలు పొందగా, ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టింది మాత్రం 6 లక్షల మంది రైతులేనని అన్నారు.

రుణాలు పొందిన రైతులు కచ్చితంగా ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టేలా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు కృషి చేయాల న్నారు. కేసీఆర్‌ అధికారం చేపట్టిన తరువాత నిరంతరాయంగా విద్యుత్‌ అందించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అధిక శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే సీఎంలు కావడంతో తెలంగాణ ప్రాంతం, ప్రజలు నిర్లక్ష్యానికి గురైన విషయం వాస్తవమేనని జి. చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటున్నా దానిని నాలుగు దఫాలుగా విభజించడంతో రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడానికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరు వాత కేసీఆర్‌ తొలి ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయ రంగానికేనని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్‌ కృపాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సత్యనారా యణ, అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు