బీజేపీ నేతల వ్యాఖ్యలు అవివేకం

5 Sep, 2017 01:50 IST|Sakshi

ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌:
నిజాం పాలనతో సీఎం కేసీఆర్‌ పాలనను పోల్చడం బీజేపీ నేతల అవివేకమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నిజాంది రాచరిక పాలన అయితే కేసీఆర్‌ది రాజ్యాంగబద్ధ పాలన అని పేర్కొన్నారు. విమోచన యాత్ర పేరిట బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిజాం పాలన గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఉమ్మడి పాలకుల హయాంలో జరిగిన అన్యాయాలపై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ఉమ్మడి పాలకుల జలదోపిడి వల్ల 60 ఏళ్లలో తెలంగాణ రూ.50 లక్షల కోట్ల మేర నష్టపోయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలతో పోలిస్తే, నిజాం పాలనలో జరిగింది చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. 2019లో తమదే అధికారమని బీజేపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
 

మరిన్ని వార్తలు