తీవ్రవాదుల అడ్డాగా హైదరాబాద్

4 Jul, 2016 03:06 IST|Sakshi
తీవ్రవాదుల అడ్డాగా హైదరాబాద్

- ఉగ్రవాదులకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న అసదుద్దీన్
- ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
 
 హైదరాబాద్ : ‘‘హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉగ్రవాదులకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. నగరంలో పట్టుబడిన ఉగ్రవాదులకు తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తానన్న ఒవైసీపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. ఎంఐఎం పార్టీని రద్దు చేయాలి. హైదరాబాద్‌లో జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలపై త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక సమర్పిస్తా’’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతు పలుకుతున్న ఎంఐఎం పార్టీతో అధికార టీఆర్‌ఎస్ దోస్తీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

బంగారు తెలంగాణ సాధిస్తామని నిత్యం ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. టైస్టులకు మద్దతు పలుకుతున్న పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎలా బం గారు తెలంగాణ సాధిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంతో దోస్తీ పాముకు పాలు పోసి పెంచడమే అన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. ఎంఐఎం టైస్టులకు మద్దతుగా ప్రకటనలు చేయడం వల్లే హైదరాబాద్‌లో ఉగ్రవాద సానుభూతిపరులు పెరుగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేవలం ముస్లింల ఓట్లతోనే గెలిచినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. టైస్టులకు వ్యతిరేకంగా ప్రపంచం యు ద్ధం చేస్తోందని, ప్రధాని ప్రతీ దేశం తిరిగి ఉగ్రవాదాన్ని ఎలా రూపుమాపాలని ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ మాత్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 50 మందికిపైగా ఉగ్రవాదులు తెలంగాణ రాష్ట్రంలోనే దొరకడం దీనికి నిదర్శనమన్నారు. ఎన్‌ఐఏ అధికారులు ఉగ్రవాదులను పట్టుకోకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు