ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌

6 Apr, 2017 02:34 IST|Sakshi
ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌

- బీఎస్‌–4 ప్రమాణాలపై రవాణాశాఖకు అందని స్పష్టత
- ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌ తిరస్కరణ
- తెలంగాణ వ్యాప్తంగా 750 వాహనాల ఎదురుచూపు
- కేంద్రాన్ని స్పష్టత కోరాలని రవాణాశాఖ నిర్ణయం  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కొత్త ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. భారత్‌ స్టేజ్‌–4 ప్రమాణాలను అందుకోని వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి తదను గుణంగా ఉన్న వాహనాలనే అమ్మాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో కొంత అయోమయం నెలకొనడంతో రవాణాశాఖ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లను ఆపేసింది. బీఎస్‌–4 ప్రమాణాలు ట్రాక్టర్లకు వర్తించవు. సాధారణ వాహనాల్లాగా ప్రయాణికులను తరలించేందుకో, సరుకు రవాణాకో ఉద్దేశించినవి కాకపోవడంతో వాటిని ఆఫ్‌ రోడ్‌ వాహనాల కేటగిరీలో ఉంచారు. దీంతో భారత స్టేజ్‌ ప్రమాణాలు దీనికి వర్తించవు.

సుప్రీం ఆదేశాల మేరకు  ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌ –4 ప్రమాణాల మేరకు లేని వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయ డానికి వీలులేదు. అంటే ఆ ప్రమా ణాలకు లోబడి మార్పుచేర్పులు చేసిన వాహనాలనే విక్రయించాలి. ట్రాక్టర్లు బీఎస్‌–4 పరిధిలోకి కాకుండా ట్రాక్టర్‌ ఎమిషన్‌ (టీఆర్‌ఈఎం) కోవలోకి వస్తాయి. కానీ దీనికి సంబంధించిన స్పష్టతను కేంద్రం రాష్ట్ర రవాణా శాఖకు అందించలేదు. దీంతో ట్రాక్టర్లను కూడా బీఎస్‌–4 కేటగిరీలోకి చేరుస్తూ అవి ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వాటి రిజిస్ట్రేషన్‌ సాధ్యం కాదని రాష్ట్ర రవాణాశాఖ తేల్చింది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాటి రిజిస్ట్రేషన్లను నిలిపివే సింది. దీంతో కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులు వాటి రిజిస్ట్రేషన్‌ లేకపోవటంతో ఇబ్బందు లకు గురవుతున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లను సరఫరా చేసింది. దీని కింద ట్రాక్టర్లు పొందిన వారికి కూడా రిజి స్ట్రేషన్లు నిలిపివేశా రు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 750 వరకు కొత్త ట్రాక్ట ర్లకు అధికారులు రిజిస్ట్రేషన్‌లను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్‌ లేని ట్రాక్టర్లు ఎక్కడైనా ప్రమాదానికి గురైతే దానికి బీమా మొత్తం వచ్చే అవకాశం లేకపోవటంతో వాటిని తిప్పటానికి కొనుగోలుదారులు భయపడు తున్నారు. మరో వైపు రిజిస్ట్రేషన్‌ లేకుండా తిప్పితే వాటిని స్వాధీనం చేసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరించటంతో కొనుగోలుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది.

రిజిస్ట్రేషన్లు ఆపాం
‘రాష్ట్రవ్యాప్తంగా కొత్త ట్రాక్టర్లకు ఏప్రిల్‌ ఒకటి తర్వాత రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన మాట నిజమే. అవి బీఎస్‌–4 పరిధిలోకి రావన్న స్పష్టత మాకు అందలేదు. ట్రాక్టర్‌ డీలర్లు మాకు ఈ మేరకు వినతులు అందించారు. దీంతో దానిపై కేంద్రం నుంచి స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం. స్పష్టమైన ఆదేశాలు పొందిన తర్వాత తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం’
– వెంకటేశ్వర్లు, జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌

మరిన్ని వార్తలు