పీడీ యాక్ట్ పెట్టాలి

1 Oct, 2016 01:56 IST|Sakshi

నకిలీ విత్తన కంపెనీలపై టీటీడీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్న విత్తన కంపెనీలు, డీలర్లపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు డిమాండ్ చేశారు. ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా నిషేధించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అయితే నకిలీ విత్తన భాండాగారంగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు.

మిర్చి, పత్తి వంటి విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఆయా కంపెనీల ద్వారా రైతులకు ప్రభుత్వం ఇప్పించాలని లేదా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. శనగ విత్తనాల ధరను ఒకేసారి 90 శాతానికి పైగా పెంచి, రైతుకిచ్చే సబ్సిడీని 51 శాతం నుంచి 31 శాతానికి తగ్గించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సెప్టెం బర్ 20తో ముగిసిన ఖరీఫ్ కాలానికి రూ.17,800 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించగా, బ్యాంకులు రూ.8 వేల కోట్లు మాత్రమే రుణాలిచ్చాయన్నారు.

మరిన్ని వార్తలు