ఎస్సైనంటూ డాక్టర్‌కు బెదిరింపులు

12 Dec, 2016 15:07 IST|Sakshi

హైదరాబాద్ : ఎస్సైనంటూ ఓ వ్యక్తి చేస్తున్న బెదిరింపులపై హైదరాబాద్ రహ్మత్నగర్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం... రహ్మత్‌నగర్ జవహర్‌నగర్ ప్రాంతంలో వి. చంద్రశేఖర్ అనే వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన ఎండి. అస్లాం(35) అనే జ్వర బాధితుడు ఆ క్లినిక్‌లో వైద్యం చేయించుకున్నాడు. చికిత్స అనంతరం తాను ఉద్గిర్‌లో జరిగే వివాహానికి వెళ్తున్నట్లు చెప్పాడు.

ఈ నెల 19వ తేదీన సందీప్ పాటిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను ఉద్గిర్ ఎస్సైనంటూ పరిచయం చేసుకున్నాడు. క్లినిక్‌లో అస్లాంకు సరైన చికిత్స చేయకపోవటంతో అతడి పరిస్థితి సీరియస్‌గా ఉందని రూ.45 వేలు ఆస్పత్రి ఖర్చుల కోసం పంపించాలని చంద్రశేఖర్‌ను బెదిరించాడు. లేకపోతే కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ రూ.45 వేలు సందీప్‌పాటిల్ సూచించిన అకౌంట్‌కు బదిలీ చేశాడు. మరునాడే మళ్లీ ఫోన్‌చేసి అస్లాం పరిస్థితి విషమించిందని ఇంకో రూ.40 వేలు పంపాలంటూ ఆ ఆగంతకుడు డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సందీప్ పాటిల్‌పై ఐపీసీ సెక్షన్ 419, 420, 506ల కింద కేసు నమోదు చేసి, జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు