దారుణం: కట్నం డిమాండ్.. డాక్టర్ ఆత్మహత్య

7 Dec, 2023 09:03 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో దారుణం జరిగింది. కట్నం కారణంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడని ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న షహానా మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. పీజీ డాక్టర్‌ అయిన తన స్నేహితుడు పెళ్లి ప్రస్తావన నుంచి విరమించుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపించారు. 

షహానా(26) తిరువనంతపురంలో డాక్టర్ పీజీ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో తన స్నేహితుడితో పెళ్లి సంబంధం కూడా ఏర్పడింది. కానీ పెళ్లి కొడుకు తరుపువారు భారీ స్థాయిలో కట్నం అడిగారు. కానీ షహానా అంత మొత్తంలో కట్నం చెల్లించుకోలేకపోయింది. దీంతో పెళ్లి  సంబంధాన్ని వరుడు విరమించుకున్నాడు. ఆ తర్వాత షహానా తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది.

షహానా కుటుంబాన్ని పరామర్శించిన కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అడ్వకేట్ సతీదేవి.. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ అన్ని బాధ్యతల నుంచి తొలగించింది. 

తిరువనంతపురం మెడికల్ కాలేజీలో మహిళా పీజీ డాక్టర్ ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్..  మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. వరకట్నం డిమాండ్ల కారణంగానే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇదీ చదవండి: దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం

     

>
మరిన్ని వార్తలు