లక్ష్యం... సుదూరం

1 Apr, 2015 00:20 IST|Sakshi
లక్ష్యం... సుదూరం

ఆదాయ సముపార్జనలో వివిధ విభాగాల వెనుకబాటు
వాణిజ్య పన్నుల శాఖలో నిరాశ
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖదీ అదే తీరు
రవాణా శాఖ ఆదాయానికి బ్రేకులు
ఆబ్కారీ శాఖకు మాత్రం కాసుల పంట

 
సిటీబ్యూరో:  గ్రేటర్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాలు ఆదాయ లక్ష్యాలకు అల్లంత దూరంలో నిలిచిపోయాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చిపెట్టేవిషయంలో వివిధ శాఖలు వెనుకబడినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆబ్కారీ శాఖలో మాత్రమే పురోగతి కనిపించింది. మిగిలిన విభాగాలు డీలా పడ్డాయి. మంగళవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల ఆదాయం ఇలా ఉంది...

వాణిజ్య పన్నుల శాఖ డీలా

రాష్ట్ర ఖజానాకు కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఆదాయ లక్ష్యాలను చేరుకోలేదు. నూతన రాష్ట్ర ఆవిర్భావంతో నెలకొన్న పరిస్థితులు, మహా నగరంలో స్థిరాస్తి క్రయ విక్రయాలు మందగించడం, వ్యాపార, వాణిజ్య రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రేటర్‌లోని ఏడు డివిజన్లకు కలిపి  2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.19,435 కోట్ల లక్ష్యానికి గాను రూ.16,420 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది రూ.14,542 లక్ష్యానికి గాను రూ.10,224 కోట్లు లభించింది. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి వ్యాట్ (విలువ ఆథారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. వృత్తి, వినోద పన్నుల ద్వారా కొంత వరకు రాబడి  లభిస్తుంది. మొత్తం వసూళ్లలో వ్యాట్‌తోనే సుమారు 85 శాతంపైగా, మిగతా పన్నులతో మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరింది.

రిజిస్ట్రేషన్ శాఖదీ అదే తీరు

ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2014-15 వార్షికాదాయం పూర్తిగా పడిపోయింది. ఈ శాఖ మొత్తం ఆదాయంలో మహా నగర వాటా 68.89 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వార్షికాదాయ లక్ష్యం రూ.923.27 కోట్లకు గాను  రూ.540.20 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఏడాది రూ.814.60 కోట్లకు గాను రూ.600.88 కోట్లు లభించింది. రంగారెడ్డి జిల్లాలోఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.2361.69 కోట్లు కాగా... రూ.1278.11 కోట్లు సమకూరింది. గత ఏడాది రూ.2262.19 కోట్ల లక్ష్యమైతే... రూ.1378.05 కోట్లు లభించింది. రియల్ బూమ్ మందగించడంతో ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన అంశం స్థిరాస్తి రంగాన్ని అచేతనంగా మార్చినట్లయింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయినట్లు ఆ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రవాణా ఆదాయానికి బ్రేక్

హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయ లక్ష్యం రూ.740 కోట్లు కాగా... సాధించింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. అంటే కేవలం 70 శాతమే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.900 కోట్ల ఆదాయ లక్ష్యానికి.. రూ.638.56 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, రియల్ బూమ్ తగ్గడంతో... నూతన వాహనాల కొనుగోళ్లు పడిపోవడం... పర్యాటకం మందగించడంతో ట్రావెల్స్ వ్యాపారం తగ్గడమే దీనికి ప్రధాన కారణమని ఆర్టీఏ వర్గాలు తెలిపాయి.
 
ఆబ్కారీ శాఖకు మాత్రం కాసుల పంట


హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల  పరిధిలో ఆబ్కారీ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఉభయ జిల్లాల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.265 కోట్లకు ఈ ఏడాది రూ.296 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. గతఏడాదితో పోలిస్తే సుమారు 11.69 శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించాయి. గ్రేటర్‌లో రియల్, ఐటీ, టూరిజం వంటి రంగాల్లో స్తబ్ధత నెలకొన్న తరుణంలోనూ ఆబ్కారీ శాఖ ఆదాయం మెరుగుపడడం గమనార్హం.

మరిన్ని వార్తలు