-
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
‘టీజీ’ స్మార్ట్ కార్డులేవీ ?
సాక్షి, హైదరాబాద్: వాహనాల నంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారింది. ఈనెల 15 నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ సీరీస్ కేటాయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ రోజుకు దాదాపు 10 వేల వరకు కొత్త వాహనాలు రాష్ట్రంలో రోడ్డెక్కుతాయి. ఇప్పటి వరకు ఏ వాహనానికి కూడా టీజీ సీరిస్ ఆర్సీబుక్ గానీ, కొత్త లైసెన్సు స్మార్ట్కార్డు గానీ జారీ కాలేదు. అయితే దీనిపై రవాణాశాఖ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్ కార్డుల జారీ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, చిప్తో కూడి కార్డు సరఫరా చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వాటి జారీ ఆగిపోయింది. చార్జీల వసూలు సరే... ఆర్సీ, నంబర్ ప్లేట్, లైసెన్స్ బట్వాడా పేరిట చార్జీలు వసూలు చేస్తున్న రవాణాశాఖ వాటిని వారంరోజులుగా ఇవ్వకపోవడంపై వాహనదా రులు షోరూమ్ నిర్వాహకులనో, రవాణాశాఖ అధికారులనో ప్రశ్నిస్తే.. సంబంధిత సాఫ్ట్వేర్లో ఆమేరకు మార్పు చేయాల్సి ఉందని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. రెండుమూడు రోజుల్లో వాటి బట్వాడా మొదలవుతుందని చెబుతున్నారు. వాహనాల రాష్ట్ర కోడ్ మారినందున సాఫ్ట్వేర్ను కూడా యుద్ధప్రాతిపదికన మార్చాలి. ఈనెల 15 నుంచి రాష్ట్ర కోడ్ మారుతుందని రవాణాశాఖకు స్పష్టమైన అవగాహన ఉంది. వెంటనే సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయొచ్చు. కానీ వారం రోజులు గడుస్తున్నా అప్డేట్ కాలేదని పేర్కొంటుండటం విచిత్రంగా ఉంది. రాష్ట్ర కోడ్ మార్పు అమలులోకి రావటానికి మూడు రోజుల ముందు నుంచే కార్డుల జారీ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇన్ని రోజులుగా సాఫ్ట్వేర్ను ఎందుకు అప్డేట్ చేయటం లేదో..ఎందుకు జాప్యం జరుగుతోందో సమాచారం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించటం లేదు. ఆర్సీ, లైసెన్స్ స్మార్ట్కార్డులు లేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తనిఖీ చేస్తే డౌన్లోడ్ చేసుకున్న పత్రాలను చూపండి అంటూ రవాణాశాఖ సిబ్బంది సలహా ఇస్తున్నారు. కానీ, రాష్ట్ర సరిహద్దులు దాటే చోట ఉండే చెక్పోస్టుల్లో సిబ్బంది ఆ కాగితాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, చిప్ ఉన్న స్మార్ట్ కార్డులే చూపాలని పేర్కొంటున్నారని వాహన దారులు చెబుతున్నారు. -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
9999 నంబరుకు రూ.4.61లక్షలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వాహనాల నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్లో మంచిర్యాల జిల్లా రవాణా శాఖా కార్యాలయానికి బుధవారం భారీగా ఆదాయం సమకూరింది. టీఎస్ 19 హెచ్ సిరీస్ ముగింపుతోపాటు టీఎస్ 19 జే సిరీస్ ప్రారంభంలో రవాణాశాఖకు భారీ ఆదాయం వచ్చింది. టీఎస్ 19 హెచ్ 9999 నంబర్కు ఆన్లైన్ బిడ్డింగ్లో గత ఏడాది సిరీస్లో రూ.3 లక్షల వరకు రాగా ఈ ఏడాది రూ.4,61,111 ఆదాయం వచ్చింది. ఇక బుధవారం ఒక్క రోజే 12 వాహనాల లక్కీ నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్ 19 హెచ్ 9999 నంబరు కోసం ఆన్లైన్లో నలుగురు పోటీ పడగా విక్టర్ దినేశ్ రూ.4,61,111కు దక్కించుకున్నాడు. టీఎస్ 19 జే 0001 నంబరు కోసం ముగ్గురు పోటీ పడగా అరికెపూడి శివకుమార్ రూ.1.17 లక్షలకు సొంతం చేసుకున్నాడు. టీఎస్ 19 జే 0006 నంబరు కోసం ఇద్దరు పోటీ పడగా మంచిర్యాలకు చెందిన కంకణాల శ్యాంసుందర్ రూ.95 వేలకు సొంతం చేసుకున్నాడు. టీఎస్ 19 జే 0009 నంబరు కోసం ఇద్దరు పోటీ పడగా మంచిర్యాలకు చెందిన రాజశేఖర్ అతి తక్కువలో అంటే రూ.50,000కే సొంతం చేసుకోవడం గమనార్హం. ఇవే కాకుండా టీఎస్ 19 హెచ్ 9988 నంబరుకు రూ.5 వేలు, టీఎస్ 19 హెచ్ 9995 నంబరుకు రూ.2 వేలు, టీఎస్ 19 జే 0008 నంబరుకు 13,600, టీఎస్ 19 హెచ్ 9996 నంబరు రూ.5 వేలు, టీఎస్ 19 జే 0005 నంబరు రూ.10 వేలు, టీఎస్ 19 హెచ్ 9998 నంబరు రూ.5 వేలు, టీఎస్ 19 హెచ్ 9008 నంబరు రూ.5 వేలు, టీఎస్ 19 జే 0003 నంబరు రూ.10 వేలు, టీఎస్ 19 హెచ్ 9969 నంబరు రూ.5 వేలతో బిడ్డింగ్ పలికింది. ఇక రవాణా శాఖకు ఈ నంబర్ల ఫీజుల ద్వారా రూ.2,04,000, మొత్తం బిడ్డింగ్ ద్వారా రూ.7,11,712 వరకు ఆదాయం సమకూరినట్లు డీటీఓ కిష్టయ్య తెలిపారు. కాగా రవాణా శాఖలో వాహన నంబర్ల కేటాయింపు సిరీస్ ముగింపు, ప్రారంభంలో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. -
లైసెన్స్టు కిల్!
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భారీ వాహన డ్రైవర్లకు లైసెన్సు రెన్యువల్ సమయంలో ఒకరోజు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. డబ్బు వసూలే ధ్యేయంగా ఏర్పడ్డ కొన్ని ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు రవాణాశాఖలో తెరవెనక చక్రం తిప్పుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ట్రక్కుల్లాంటి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. తమ లైసెన్సులను ప్రతి ఐదేళ్లకోసారి (ట్రాన్స్పోర్టు కేటగిరీ) రెన్యువల్ చేసుకోవాలి. అదే ప్రమాదకర పదార్థాలు తరలించే వాహనాల డ్రైవర్లు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ సమయంలో కేంద్రప్రభుత్వ నిర్దేశిత పద్ధతిలో డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి. వాహనాలు నడపడం, జాగ్రత్తలు తీసుకోవడం, ప్రమాదాలను తప్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ప్రమాదాన్ని నివారించలేని పక్షంలో వీలైనంతవరకు దాని తీవ్రత తగ్గేలా చూడటం, రోడ్లలో వస్తున్న మార్పులు.. ఇలా పలు అంశాల్లో ఆధునిక సాంకేతికత ఆధారంగా ఆ శిక్షణ కార్యక్రమం ఉండాలి. ఆ శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ వచ్చిన వారికి మాత్రమే లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కొందరు డ్రైవర్లు మధ్యలో కొన్నేళ్లపాటు వేరే ఉద్యోగంలో ఉండి, మళ్లీ డ్రైవింగ్కు వచ్చే వారుంటారు. వారు డ్రైవింగ్ ఆపేసిన తర్వాత స్కిల్స్ తగ్గిపోతాయన్నది శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇలాంటి వారికి ఈ తరహా శిక్షణ అవశ్యమని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో సిరిసిల్లలోని ‘టైడ్స్’ ఎంపిక గత ఏడాది మన దేశంలో రోడ్డు ప్రమాదాల రూపంలో లక్షన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. కొన్నేళ్లుగా ఈ సంఖ్య ఇదే రీతిలో నమోదవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో వాటిని నివారించేందుకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అందులో భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు తరచూ.. ఇటు డ్రైవింగ్, అటు వాహనాల్లో వస్తున్న మార్పులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఈ శిక్షణ కోసం సిరిసిల్ల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టీఐడీఎస్)’ను ఎంపిక చేసింది. ఏం జరుగుతోంది? గతంలో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ల నుంచే డ్రైవర్లు శిక్షణ సర్టిఫికెట్ పొందేవారు. చాలా డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వకుండానే, రూ.5 వేల వరకు వసూలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం... రూ.20 కోట్ల వ్యయంతో ఆత్యాధునికంగా తీర్చిదిద్దిన సిరిసిల్లలోని టైడ్స్ను శిక్షణకు ఎంపిక చేసింది. దీంతో కొందరు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు పైరవీ అధికారులతో కుమ్మక్కయ్యారు. సిరిసిల్లకు వెళ్లి డ్రైవర్లు శిక్షణ తీసుకోవటం కష్టమని, అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నందున వాటిల్లో శిక్షణకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఉన్నతస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లైసెన్సు ఇచ్చేప్పుడు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల నుంచి తెచ్చిన సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రెన్యువల్కు అంగీకరిస్తే ఏంటన్న కోణంలో ఈ ఒత్తిళ్లు నడుస్తున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అవసరమైతే, ఆర్టీసీ శిక్షణ కేంద్రాల సహకారం తీసుకోవాలని కూడా చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement