వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్‌

29 Jul, 2017 02:00 IST|Sakshi
వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్‌

కాంగ్రెస్‌ నేతలకు కర్నె ప్రభాకర్‌ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు జైరాం రమేశ్‌ మొదలు గల్లీ లీడర్ల దాకా రాష్ట్ర ప్రభుత్వంపై పదే పదే అనవసర విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు, మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగితే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, భానుప్రసాద్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. గాంధీ భవన్‌లో గాలి సామ్రాట్లు ప్రెస్‌మీట్‌లు పెడుతూ గాలి కూతల్లో డాక్టరేట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలను పదే పదే మాట్లాడితే నిజం అవుతాయనే భ్రమల్లో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని, వారిని మించిన ఇసుక డాన్లు ఎవరూ లేరన్నారు.

డ్రగ్స్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలే: జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సంస్కృతిని పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీలేనని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌ విమర్శలు చేయడం అంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్‌లో 3 పబ్‌లే ఉన్నాయన్న రేవంత్‌ దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు.

మరిన్ని వార్తలు