అబిడ్స్: జనసేన అధ్యక్షులు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది పవనిజం కాదని అంతా బ్రోకరిజమేనని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను తిరస్కరించడం ఖాయమన్నారు. బుధవారం జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తున్నందునే ఆయన జీవిస్తున్నాడన్నారు. ఎన్నికలు వ స్తేనే పవన్ కళ్యాణ్కు ప్రజలు గుర్తొస్తారా.. అని ఎద్దేవా చేశారు.
ప్రతి ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి బ్రోకరిజం చేసే పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎంతో తెలివైనవారని, పవన్ కళ్యాణ్ను తరిమికొడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలతోనే ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రేమ్కుమార్ధూత్, మహేందర్కుమార్, ధన్రాజ్, సాయికుమార్, శాంతిదేవి, వీరూసింగ్, సురేష్ముదిరాజ్, పి. వినోద్ పాల్గొన్నారు.