‘టెక్నాలజీ’ పూర్తిగా వాడేశాడు...!

17 Mar, 2016 00:31 IST|Sakshi
‘టెక్నాలజీ’ పూర్తిగా వాడేశాడు...!

పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్టు
సహకరించిన స్నేహితుడూ రిమాండ్

పంజగుట్ట: అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థితో పాటు అతడికి సహకరించిన మరో విద్యార్థిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.  పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్ నవ్‌భారత్‌నగర్ నివాసి షేక్ ఎజాజ్ (19) 2014లో ఎస్సార్‌నగర్‌లోని న్యూవిజన్ జూని యర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఆరు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.  కొన్ని రోజులు సెల్‌ఫోన్ సంస్థలో పని చేసిన ఇతను ఫోన్ టెక్నాలజీ-పని తీరును పూర్తిగా అవగాహన చేసుకున్నాడు.  ఈ టెక్నాలజీతో కాపీయింగ్‌కు పాల్పడి ఎలాగైనా ఇంటర్మీడియట్ పాస్ కావాలని నిర్ణయించుకున్నాడు.  ఆన్ లైన్  ద్వారా ఇందుకు అవసరమైన బ్లూటూత్, వైర్‌లెస్ మైక్రోఫోన్, చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్‌ఫోన్ తెప్పించుకున్నాడు.

ఎస్సార్‌నగర్‌లోని రాయల్ జూనియర్ కాలేజీలో పరీక్ష సంటర్ పడింది. ఇంజినీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న తన స్నేహితుడు మహ్మద్ సమీయుల్లా (19) సాయంతో సివిక్స్ -1, సివిక్స్ -2 పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఈనెల 12న ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వెళ్లగా... చీఫ్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి ఎజాజ్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించాడు. వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎజా జ్, సమీయుల్లాలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

 

మరిన్ని వార్తలు