టీఆర్‌ఎస్‌కు బీజేపీ అంటే భయం

22 Sep, 2017 02:07 IST|Sakshi
టీఆర్‌ఎస్‌కు బీజేపీ అంటే భయం

ఎమ్మెల్సీ రాంచందర్‌రావు  
సాక్షి, హైదరాబాద్‌
: బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, బలాన్ని చూపి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ కాళేశ్వరం సొరంగంలో ప్రమాదానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయం కాబట్టే విమోచన యాత్రకు అడ్డంకులు కల్పించారని, ఇప్పుడు కాళేశ్వరం సొరంగానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌ను విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్‌ నేతలకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకు కొత్తకొత్త మాటలు చెప్పి తప్పించుకోవడానికి సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నాసిరకం బతుకమ్మ చీరల వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పాతబస్తీలో జరుగుతున్న మహిళల అక్రమ రవాణ వెనుక ఎంఐఎం హస్తముందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు