నిమ్స్‌లో కోల్డ్‌వార్

9 May, 2016 01:24 IST|Sakshi
నిమ్స్‌లో కోల్డ్‌వార్

ఇమడలేక వీడిపోతున్న వైద్యులు
దీర్ఘకాలిక సెలవులో సర్జికల్ ఆంకాలజిస్ట్

సీనియర్లు లేక మూతపడుతున్న థియేటర్లు

సాక్షి, సిటీబ్యూరో:  ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని కొంతమంది వైద్యుల మధ్య నెల కొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వైద్యులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. విభాగాధిపతులు, ఉన్నతాధికారుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రతిభావంతులైన పలువురు సీనియర్ వైద్యులు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆస్పత్రిలో 70కి పైగా వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. అంతర్గత పోరు, వనరుల లేమికి తోడు సరైన అవకాశాలు రాకపోవడంతో ఏటా పది శాతం మంది వైద్యులు ఇదే కారణంతో ఆస్పత్రిని వీడుతున్నట్టు అధికారులే అంగీకరిస్తున్నారు.

మనస్తాపంతో దీర్ఘకాలిక సెలవు

సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ జగన్నాథం గత ఏడాదే పదవీ విరమణ చేశారు. ఇప్పటి వరకు ఆ పోస్టులు భర్తీ చేయక పోవడంతో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న వైద్యులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో 50 పడకలను సర్జికల్ ఆంకాలజీ రోగులకు కేటాయించారు. ఇక్కడ నిత్యం 50-60 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికి కేటాయించిన రెండు ఆపరేషన్ థియేటర్లలో రోజుకు సగటున 8-10 శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది.

సర్జికల్ ఆం కాలజీ విభాగానికి మూడు ఐసీయూ బెడ్స్‌ను కేటాయించారు. వీటిని కూడా జనరల్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యుడు కబ్జా చేశాడు. దీంతో ఇరు విభాగాధిపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ అంశాన్ని డెరైక్టర్ దృష్టికి తీసుకెళితే.. తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. మెడికల్ సూపరింటిండెం ట్ కూడా జనరల్ సర్జరీ విభాగాధిపతికి కొమ్ముకాస్తున్నారు. మనస్తాపం చెందిన సదరు సర్జికల్ ఆంకాలజీ అధిపతి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుని వారం రోజుల్లో ఇంటికి తిరిగి వెళ్తామని భావించి వచ్చిన రోగులు నెలల తరబడి వార్డుల్లోనే మగ్గాల్సి వస్తోంది.

 వేధింపులతో ఇమడలేక..

న్యూరోసర్జరీ విభాగంలో సీనియర్ సర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి ఇప్పటికే వెళ్లిపోగా, సీని యర్ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్ కూడా నిమ్స్ ను వీడారు. పరిపాలనా పరమైన వేధింపులే ఇం దుకు కారణమని తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆర్థోపెడిక్ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ రాజీ నామా తర్వాత మోకాలి శస్త్రచికిత్సలు 10-15 శాతానికి పడిపోవడానికి కూడా ఇదే కారణం. పాత భవనంలోని పలు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయడం లేదు.

ల్యామినర్ ఎయిర్ ఫ్లో లేదు. చిన్నపాటి వ ర్షం కురిసినా పైకప్పు కారుతోంది. ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుండడం వల్ల రోగులు ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యులే చెబుతున్నారు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ ప్రొఫెసర్ ఇటీవల వీఆర్‌ఎస్‌పై వెళ్లిపోయారు. అనస్థీషియన్ల కొరత వల్ల ఆరు ఆపరేషన్ థియేటర్లు మూతపడడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు