టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి

24 Jan, 2016 01:49 IST|Sakshi
టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
శాలిబండ: ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు ముస్లిం మైనార్టీలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్‌తో కలిసి పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకు ఓటు వేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...

టీఆర్‌ఎస్ నాయకులు కళ్లబొల్లి మాటలతో ముస్లిం మైనార్టీలను దగా చేస్తున్నారన్నారు. మజ్లీస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న బీజేపీ దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు. మైనార్టీ యువకులను ఎన్‌కౌంటర్ పేరుతో హతమారుస్తున్నా మజ్లిస్ నేతలు నోరు మెదపడం లే దన్నారు. పాతబస్తీలోని 12 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పాతబస్తీలో తమ ప్రచారానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక మజ్లీస్ నేతలు తమ కార్యకర్తలు, నాయకులను బెదిరిస్తున్నారన్నారు. తమ కార్యకర్తలకు హాని జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ మాట్లాడుతూ... హైదరాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రౌడీలతో కలిసి పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు తన కార్యకర్తలపై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమను ఎన్నికల్లో ఎదుర్కోవాలన్నారు.

మరిన్ని వార్తలు