హైదరాబాద్: మాదాపూర్లో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టీ హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నోవర్టిస్ సాఫ్ట్వేర్ కంపెనీ సమీపంలో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో సోమవారం రాత్రి సెల్లార్ పునాది గోడ కూలి జియాఉల్ అన్సారీ అలియాస్ సోను(22), దిలీప్కుమార్ యాదవ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరితోపాటు గాయపడిన ఇతర కార్మికులు చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు బిహార్కు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.