చిన్నారి కళ్ల ముందే ఉరేసుకున్న తల్లి

27 Sep, 2016 18:22 IST|Sakshi

కుత్బుల్లాపూర్: భర్తతో తలెత్తిన తగాదాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల సాక్షిగా క్షణికావేశంలో ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కపికేశ్వరపురం కిరిమిల్లి గ్రామానికి చెందిన త్రిమూర్తులు, సుంకరి స్వరాజ్యలక్ష్మి(26) దంపతులు కొంపల్లిలోని ఆదిత్య రాయల్ పార్క్ మానస రెసిడెన్సీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తూ త్రిమూర్తులు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నారు.

ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం కూడా వారు గొడవ పడ్డారు. త్రిమూర్తులు విధి నిర్వహణ నిమిత్తం బయటకు వెళ్లగా స్వరాజ్యలక్ష్మి తన కుమార్తె(2) ముందే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అదే సమయంలో బాబు ఇంటి బయటు ఆడుకుంటున్నాడు. కొద్ది సేపటి తరువాత చిన్నారి ఏడుపు విని చుట్టు పక్కలవారు తలుపు ఎంత కొట్టినా తెరవకపోవడంతో వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఆ గదిలోనే ఏడుస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు