పోలీసులకు చెమటలు పట్టిస్తున్న యువతి

11 Mar, 2016 09:28 IST|Sakshi
పోలీసులకు చెమటలు పట్టిస్తున్న యువతి

హైదరాబాద్ : కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించాలని స్టేషన్ ముందు బైఠాయించడమే కాకుండా... అర్దరాత్రి స్టేషన్ వద్ద నిద్రమాత్రలు మింగి బంజారాహిల్స్ పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోందో యువతి. వివరాలు... దిల్‌షుక్‌నగర్‌లో నివసించే ఒక యువతి గతేడాది షాదీ డాట్‌కామ్‌లో వరుడి కోసం వెతుకుతుండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎస్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎన్.విజయ్‌దీప్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

యువతిని విజయ్‌దీప్ తన వెంట తిప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 5న ఇద్దరికీ పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. యువతి తల్లిదండ్రులు రూ. 10 లక్షల నగదు, రూ. 25 లక్షల విలువ చేసే ప్లాట్ ఇవ్వడానికి అంగీకరించారు. పెళ్లి పనులు జరుగుతుండగా విజయ్‌దీప్ ఆమె తనకు నచ్చలేని పెళ్లికి నిరాకరించాడు.

బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాద చేయగా విజయ్‌దీప్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విజయ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆయనతోనే తనకు పెళ్లి జరిపించాలంటూ సదరు యువతి పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అది తమ పని కాదని పోలీసులు పేర్కొంటుండగా రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

బుధవారం రాత్రి 12 గంటలకు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, నిందితుడిపై కేసు కూడా నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు