పడవలను ఫోటో తీసినందుకు జైలు శిక్ష

21 Jul, 2018 12:05 IST|Sakshi
దంపతులు పమెలా, మైకేల్‌ క్లియరీ, ఫోటో తీసిన ఆర్మీ పడవలు

ఎథెన్స్‌ : ఆర్మీకి చెందిన రెండు పడవలను ఫోటో తీసిన దంపతులకు పోలీసులు జైలు శిక్ష విధించారు. తాము ఏ తప్పు చేయలేదని, పర్యటన నిమిత్తం ఆ దేశానికి వచ్చామని చెప్పినా వినిపించుకోకుండా ఇబ్బందుల పాలుచేశారు. ఈ సంఘటన గ్రీసు దేశంలోని ఎథెన్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన దంపతులు పమెలా, మైకేల్‌ క్లియరీ పర్యటన నిమిత్తం గ్రీసు దేశానికి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఐలాండ్‌ ఆఫ్‌ కాస్‌లోని ఓ ఓడరేవుకు చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మైకేల్‌ ఓడరేవులో నిలిపి ఉన్న రెండు ఆర్మీ పడవలను ఫోటో తీశాడు. ఇది గమనించిన ఓ ఆర్మీ సైనికుడు మైకేల్‌ ఫోన్‌లో తీసిన ఫోటోలను తొలగించాలని, పాస్‌పోర్ట్‌లు చూపించాలని ఆదేశించాడు. దీంతో భయపడ్డ దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని బ్రిటన్‌కు బయలుదేరారు. 

మార్గం మధ్యలో వారిని అడ్డగించిన పోలీసులు వారి చేతులకు బేడీలు వేసి అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. తాము గూఢాచారులం కాదని ఆ దంపతులు ఎంతమొత్తుకున్నా వారు విడిచి పెట్టలేదు. మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ముందు వారు తమ గోడును వెళ్లబోసుకోగా ఆయన వారిని ఊరికి పంపటానికి అంగీకరించాడు. అయితే వారి ఫోన్లను గ్రీసు పోలీసులకు అప్పగించి, బ్రిటన్‌లోని ఓ లాయర్‌తో వాదనలు వినిపించాలని షరతు విధించాడు. స్వదేశానికి చేరుకునన్న ఆ దంపతులు లాయర్‌ను ఏర్పాటు చేసుకుని వాదనలు వినిపించారు. కొన్ని వారాల తర్వాత కేసు నిలబడలేకపోయింది. దీంతో గ్రీసు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను సైతం వెనక్కు పంపించారు.   

మరిన్ని వార్తలు